నేటి నుంచే.. విశాఖపట్నం కేంద్రంగా బీజేపీ బిగ్ గేమ్ ప్లాన్: ఇక నుంచైనా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోన్న భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఏ పార్టీపైనా ఆధారపడకుండా సొంతంగా ఓటు బ్యాంకును విస్తరించుకోవడం, బూత్ స్థాయి నుంచి బలోపేతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతోంది.
ఈ క్రమంలో నేడు విశాఖపట్నంలో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ దీనికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో పాల్గొనడానికి సోమవారం రాత్రే విశాఖపట్నానికి చేరుకున్నారు కూడా. కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఇందులో చర్చించనున్నారు. ప్రత్యేకించి జెన్ జీ కి ధీటుగా పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా తీర్మానాలను ఆమోదించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 945 మండలాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కానున్నారు. వారిలో నుంచి ఎంపిక చేసిన 250 మంది యువకులతో నితిన్ నబిన్ ప్రత్యేకంగా సమావేశమౌతారు. పార్టీ భావజాలం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన ఏపీలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటన రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇందులో భాగంగా నేడు నితిన్ నబీన్.. విశాఖపట్నంలోని వీ కన్వెన్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత ఈ ఉదయం 11 గంటలకు పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. అనంతరం బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు.
దేశాభివృద్ధిలో యువత పాత్రను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖపట్నంలోని నోవాటెల్ వరుణ్ బీచ్ హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యువ సంవాద్ కార్యక్రమంలో నితీన్ నబీన్ పాల్గొంటారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఈ ఇంటరాక్టివ్ సెషన్ జరుగుతుంది. ఇందులో దాదాపు 200 మంది విద్యార్థులు, ఉద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడతారు. వికసిత్ భారత్ సాధనలో భాగంగా యువత సాధికారత, దేశ నిర్మాణం, డిజిటల్ లీడర్షిప్ వంటి కీలక అంశాలపై చర్చిస్తారు.
రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశమౌతారు నితిన్ నబీన్. నియోజకవర్గాలవారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థాగత నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆలోచనా విధాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియజేస్తూ రూపొందించిన ఓ సమగ్ర రోడ్మ్యాప్ గురించి వారికి వివరించనున్నారు.













Click it and Unblock the Notifications