తూచ్.. అలా అనలేదు.. అంబేద్కర్పై కామెంట్లపై ఎమ్మెల్యే శ్రీదేవి
అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యూటర్న్ తీసుకున్నారు. అంబేద్కర్ను తాను దూషించలేదని వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్పింగ్, ఎడిటింగ్ వీడియో వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాల దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను ఈ స్థాయిలో నిలబడేందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలే తోడ్పాటు నిచ్చాయని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రాం దళితులకు రెండు కళ్లులాంటి వాళ్లని తెలిపారు.
అంబేద్కర్ వాదినే..
చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినని చెప్పారు. వీడియో ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కుట్ర వెనుక ఎవరున్న వదిలిపెట్టేది లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంబేడ్కర్పై కామెంట్స్ చేశారు. బాబూ జగ్జీవన్రామ్ని స్ఫూర్తిగా తీసుకోవాలని.. అంబేడ్కర్ ద్వారా హక్కులు వచ్చాయా? రాలేదు. రాజ్యాంగ హక్కులను జగ్జీవన్రామ్ మనకు అమలు చేశారు. రాజకీయంగా, సామాజికంగా మనం ఎదుగుతున్నామంటే అది జగ్జీవన్రామ్ ఘనతే అని చెప్పారు. తాను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని శ్రీదేవి అన్నారు.
వైరల్.. అలా అనలేదే
అంబేడ్కర్ ద్వారా హక్కులు రాలేదని ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దళితుల ఆరాధ్య దైవం అంబేడ్కర్ను కించపరిచేలా కామెంట్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి యావత్ దళిత బహుజన జాతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలకు హక్కులు అంబేద్కర్ వల్ల రాలేదని, బాబూ జగజ్జీవన్ రామ్ వల్ల వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారని ట్రోల్ అవుతుంది. ఉండవల్లి శ్రీదేవిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను బర్తరఫ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. దీనిపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అంబేద్కర్ పై తాను ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదన్నారు.
మార్పింగ్ చేసి..
మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారని, అందువల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటివారని ఉండవల్లి శ్రీదేవి అభివర్ణించారు. మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.