గెలుపు కాదు, మెజార్టీనే ముఖ్యం: లోకేష్, విశాఖలో ‘టిడిపి’ గోబ్యాక్ నినాదాలు
తూర్పుగోదావరి/విశాఖ: ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదని, అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చైతన్యరాజు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా చూడాలని సూచించారు. గెలుపు ముఖ్యం కాదని, మెజార్టీయే ప్రధానమని లోకేష్ అన్నారు.
ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని తెలిపారు. కేవలం బూత్ స్థాయి నిర్వహణ ఖర్చులు మాత్రమే పెట్టామని లోకేష్ చెప్పారు.

టిడిపి, బిజెపి గోబ్యాక్ నినాదాలు
విశాఖపట్నం: రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు న్యాయం జరగలేదని ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు, జిల్లావాసులు రోడ్లపైకి చేరుకుని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ‘గో బ్యాక్ టిడిపి, బిజెపి ఎంపీలు' అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.
పార్లమెంటుసభ్యులు, ప్రజాప్రతినిధుల అసమర్థత వల్లే రైల్వే బడ్జెట్లో విశాఖకు తీరని అన్యాయం జరిగిందని, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన తమకు నిరాశే మిగిలిందని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడే వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు చెప్పారు.












Click it and Unblock the Notifications