అప్పుడు ఆయనే కావాలన్నాడు...ఇప్పుడు వద్దు బాబోయ్ అంటున్నాడు:ఏమా కథ!
కడప:అతడో ఆర్ఎస్ఎస్ కార్యకర్త...ఆ సంస్థలో పదేళ్ల పాటు పనిచేశాడు. ఇతడిది మోడీ అంటే పిచ్చ అభిమానం...అందుకే గత ఎన్నికలప్పుడు తన సొంత డబ్బుతో మోడీ కోసం ఊళ్లు ఊళ్లు తిరిగి ప్రచారం చేశాడు. ఆయన కోరుకున్నట్లే మోడీ గెలిగాడు...కట్ చేస్తే!
ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ అదే మోడీ ఫోటో పట్టుకొని ఊరూరూ తిరుగుతున్నాడు. అయితే చెప్పే మ్యాటర్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. అదేంటంటే...మోడీకి మాత్రం ఓటు వేయొద్దని...ఇప్పుడా వ్యక్తి ఇదే పని మీద పనిగట్టుకొని కర్ణాటక వెళ్లాడు...ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి! పొరపాటున కూడా మోడీకి ఓటు వేయొద్దని అక్కడి వాళ్లకి చెబుతూ అలుపెరగని సైనికుడిలా నిర్విరామంగా తెగతిరిగేస్తున్నాడు...ముఖ్యంగా తెలుగువాళ్లు నివసించే ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఆయనలో ఎందుకింత మార్పు?...ఆ మార్పుకు కారణం ఏమిటి?
ఈయన...ఎవరంటే?
ఈయన పేరు విజయశంకర్ రెడ్డి...ఊరు కడప జిల్లా పులివెందుల...ఆర్ఎస్ఎస్ లో పదేళ్ల పాటు జిల్లా ప్రచారక్ గా పనిచేశాడు...ఇతడికి నరేంద్ర మోడీ అంటే వల్లమాలిన అభిమానం...ఆయన సమర్థత మీద చెప్పలేనంత నమ్మకం. అభివృద్ది గురించి ఎన్నో కలలు కన్నాడు. మోడీ ప్రధాని అయితే అటు దేశానికి ఇటు ఆంధ్రప్రదేశ్ కు ఎంతో మేలు జరుగుతుందని భావించాడు. ముఖ్యంగా నల్లధనాన్ని నిర్మూలించడం, ఎపికి ప్రత్యేక హోదా ఈ రెండింటి విషయమై మోడీ మాటలకు బాగా ప్రభావితుడయ్యాడు. అందుకే గత ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానిగా చేయాలని తన సొంత ఖర్చులతో వూరూరా తిరిగి ప్రచారం చేశాడు.
Recommended Video
కోరుకున్నట్లే మోడీ గెలిచాడు...కానీ
ఇతడు కోరుకున్నట్లే మోడీ గెలిచాడు...ప్రధాని అయ్యాడు...కానీ ఆ తరువాత ఒక్కొక్కటిగా తన కలలన్నీ కల్లలయ్యాయని ఆవేదన చెందుతున్నాడు. ఇక ఎపికి మోడీ చేసిన అన్యాయం చూసి మోడీ మీద ఏకంగా ఒకరకమైన కసి పెంచుకున్నాడు. అందుకే ఈసారి మోడీకి వ్యతిరేకంగా గతంలో కంటే ఇంకా బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
అప్పట్లో రాష్ట్రంలోనే...ఇప్పుడు కర్ణాటక
మోడీకి అనుకూలంగా గత ఎన్నికల సందర్భంగా కేవలం రాష్ట్రంలోనే ప్రచారం చేసిన ఈయన ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రచారం చేయాలని భావిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఎన్నికలు జరగనున్న కర్ణాటక వెళ్లాడు. అక్కడ మోడీ ఫోటో చూపించి ఈయనకు గాని, వీళ్ల పార్టీకి గాని ఓటేయొద్దని ప్రచారం చేస్తున్నాడు. మోడీ దేశ ప్రజలను మోసం చేశాడని, ఆంధ్రప్రదేశ్ కు నమ్మకద్రోహం చేశాడని అతనిని...వాళ్ల పార్టీని నమ్మొద్దని...వాళ్లని నమ్మి ఓటేస్తే మిమ్మల్ని కూడా దారుణంగా మోసగిస్తారని ప్రచారం చేస్తున్నాడు.
మోడీ మోసం...అక్కడి తెలుగు వాళ్లకు
ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఒక్క వీధి కూడా వదలకుండా ఇల్లిల్లూ తిరుగూ మరీ ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఎపికి బిజెపి ఏమేమి హామీలిచ్చి నెరవేర్చకుండా మోసగించిందో అవన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తున్నాడట. అంతేకాదు తన ప్రచారం కి ఒక సెంటిమెంట్ కూడా ఉందని, గతంలో తాను మోడీకి అనుకూలంగా ప్రచారం చేయడం వల్ల ఆయన గెలిచాడని, ఈసారి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా కాబట్టి కర్ణాటకలో బిజెపి ఓడిపోవడం ఖాయమని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడట.