ఎన్నికల వేళ జగన్ కు కలిసొస్తున్న టీడీపీ, జనసేన రాజకీయం..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ప్రధాన ఓట్ బ్యాంక్ ను మరింతగా పెంచుకొనేలా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఈ సమయంలొ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ, జనసేన రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.
ధీమాగా సీఎం జగన్ : ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా తన సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక్ నే తన విజయానికి సహకరిస్తుందని నమ్ముతున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు తోడుగా నిలవాలని సూచిస్తున్నారు. సంక్షేమం ద్వారా బలపడిన జగన్ ను ఓడించటానికి పొత్తులు అవసరమని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ గుర్తించారు.

ఆ విషయాన్ని ఓపెన్ గానే చెబుతున్నారు, ఒంటరిగా ఓడించలేమని అంగీకరిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ సహకారం కూడా కోరుతున్నారు. టీడీపీ, జనసేన కలవటానికి సిద్దంగా ఉన్నా బీజేపీ నిర్ణయం తరువాతే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నిక ల తరువాత బీజేపీ స్పందిస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
టీడీపీ అవసరం...పవన్ అవకాశం : అటు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇటు టీడీపీతో బంధమే ఖాయమే అయినా అధికారికమే అయినా ఎన్నో సందేహాలు..అనుమానాలు కనిపిస్తున్నాయి. ఈ పొత్తు ఒక విధంగా పవన్ కంటే టీడీపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ సైతం తన బలం నిరూపించుకుంటూనే పొత్తులు కొనసాగించే ఆలోచన చేస్తున్నారు.
అందులో భాగంగా టీడీపీ అవసరాన్ని తనకు అనుకూలగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వారాహి యాత్రకు వచ్చిన స్పందన ద్వారా టీడీపీ పైన పట్టు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కోరిన సీట్లు దక్కించుకొనే విధంగా వ్యవహిస్తూ..పొత్తులపైన డైలమా కొనసాగిస్తున్నారు. అటు బీజేపీతో ఉన్న సంబంధాలను గుర్తు చేస్తున్నారు. టీడీపీ కాకపోయినా తనకు ప్రత్యామ్నాయం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఓట్ల బదిలీ సాధ్యమేనా : జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కలిసి పోటీ చేస్తామని టీడీపీ, జనసేన చెబుతున్నా..అసలు ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా అనే ప్రశ్న మొదలైంది. తాజా సర్వేల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కంటే జనసేన బలం పెరిగిందా అనే విధంగా చర్చలు సాగుతున్నాయి. టీడీపీ ఇచ్చిన అవకాశం పవన్ సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇదే ఇప్పుడు సీట్ల పంపకాల వేళ టీడీపీకి సమస్యగా మారే అవకాశం ఉంది. అటు సంక్షేమం మేనిఫెస్టో ప్రకటించినా ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. జగన్ ను విమర్శించటం మినహా.. తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఏం చేస్తామని చెప్పటంలో ఇప్పటి వరకు నేతలు మాట విప్పలేదు. దీంతో, ఈ పరిస్థితులు సీఎం జగన్ కు క్షేత్ర స్థాయిలో అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications