macherla: మాచర్లలో పోలీసులకు ముందే అందిన సమాచారం?
మాచర్లలో జరిగిన విధ్వంసంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందని, వెళ్లిపోవాలని చెప్పినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 'ఇదేం ఖర్మ' కార్యక్రమంపై దాడి జరుగుతుందని పోలీసులకు ముందే సమాచారం ఉందని, అయినా ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
జరిగిన ఘటనలన్నీ చిన్న చిన్నవే!!
మాచర్లలో జరిగినవన్నీ చిన్నచిన్న ఘటనలేనని, పోలీసుల వైఫల్యం లేదని ఎస్పీ తేల్చారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రాడ్లు పట్టుకొని అరుపులతో హల్ చల్ చేసిన ఘటన చిన్నదని ఎలా అంటారని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చావబాదారని, ఇళ్ల తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉండే వస్తువులను తుక్కు తుక్కు చేయడంతోపాటు మహిళలనే రక్తమొచ్చేలా గాయపరిచిన సంఘటనలు చిన్నవని ఎలా అనగలుగుతారంటూ పల్నాడుకు చెందిన టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు.
ఫ్యాక్షనిజం వల్లే గొడవలు?
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన 'ఇదేం ఖర్మ'లో ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడి రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడంవల్లే దాడికి దారి తీసిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఫ్యాక్షనిజంతో సంబంధమున్న పాల్గొనడంవల్లే దీనికి కారణమంటున్నారు. గొడవ జరగ్గానే బ్రహ్మారెడ్డిని వెళ్లిపోవాలని పోలీసులు సూచించారని, ఆయన వెళ్లకుండా ఉండటం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు.
జరిగినవన్నీ చిన్న చిన్న ఘటనలేనని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పాల్గొన్నవారంతా పారిపోయారని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రూ.లక్ష నగదు, బంగారం దోచుకెళ్లారు?
విచారణలో బంగారం, డబ్బులు పోయినట్లు తేలితేనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో తామే వెళ్లి ఫిర్యాదు తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనం కాలేదంటున్నారుకానీ అది బ్రహ్మరెడ్డి ఇల్లే. అందులోని సామగ్రిని బయటకు తెచ్చి నిప్పు పెట్టారు. దీన్ని పరిశీలిస్తున్నామని ఎస్పీ అంటున్నారు.
దీనిమీద కూడా విమర్శలు వస్తున్నాయి. బ్రహ్మారెడ్డి ఇల్లు, కార్యాలయం ఒకటేనని, అయినా ఎస్పీ స్వయంగా చిన్న ఘటనగా చెబుతున్నారు. ఇంట్లో సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. టీడీపీ నాయకుడు ఎర్రం పోలిరెడ్డి ఇంట్లో రూ.లక్ష నగదు, 15 సవర్ల బంగారం దోచుకెళ్లారని ఆయన భార్య అన్నపూర్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో లాకరు తాళాలు పగలగొట్టి పత్రాలన్నీ చిందరవందరగా పడేశారని చెప్పారు. కానీ అవి పోయినట్లు తేలితేనే కేసు నమోదు చేస్తామనడంలో పోలీసులు ఉద్దేశం... కేసును సాగదీయడానికేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.