కలకలం రేపిన పరకాల తీర్మానం: చంద్రబాబు వివరణ
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం కొంత కలకలం రేపింది.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం కార్యక్రమంలో పరకాల ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈయన తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నట్టు దాఖలాలు లేవు.
కాగా, దీనిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు వేదికపై నుంచి వివరణ ఇచ్చారు. పరకాల ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తప్పేమీ కాదని, ఆయన ప్రభుత్వ సలహాదారు అని, అతని పదవీ నియామకం రాజకీయంగా జరిగిందని వివరించారు.
అయితే, ప్రతీ మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నా అందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, మహానాడు రెండో రోజు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ గైర్హాజరయ్యారు.