వరద రాజకీయాలపై మండిపడ్డ పవన్ ... మంత్రుల బాధ్యత ఇదేనా ? అని ప్రశ్న
ఎగువ రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తడంతో ఏపీలో పలు జిల్లాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి వరదలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ముంపుకు గురికాగా కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాలలో పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. అయితే వరద ముంపుకు గురైన గ్రామాలలో సహాయ చర్యలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అధికార పార్టీ మాత్రం సహాయక చర్యలు విషయం పక్కనబెట్టి చంద్రబాబు ఇల్లు ములుగు తుందా లేదా అన్న దానిపైన మాత్రమే చర్చ చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొన్న కన్నా... నిన్న పవన్ వరద రాజకీయాలపై ఫైర్
మొన్నటికి మొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజల సహాయం కోసం అర్ధిస్తున్నా ప రెండు పార్టీలు రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రం వరద ముంపు తో కష్టాల్లో సీఎం జగన్ అమెరికా వెళ్లిపోయారని, ఇక చంద్రబాబు హైదరాబాద్ చెక్కేశారని , ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారు అని పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు. వరదల్లో చిక్కుకుపోయి ప్రజలు నానా కష్టాలు పడుతుంటే చంద్రబాబు ఇంటి పై డ్రోన్ల రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముంపుకు గురయ్యే ఇల్లు చంద్రబాబు ఇల్లు తప్ప వేరే ఇది కనిపించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరకట్ట మీదే వరద ప్రభావం కనిపిస్తుందా ? అధికార పార్టీ నేతలకు చురకలంటించిన పవన్
కృష్ణా నది వరద తో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ళు నీటమునిగి తినడానికి తిండి లేక, నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టనట్టు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఇప్పటికీ సహాయం ఉందని ముంపుకు గురైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిపైనే దృష్టి సారించాలని హితవు పలికారు.
కృష్ణా నది కరకట్ట చుట్టూ తిరుగుతూ చంద్రబాబు ఇంటి గురించి సెటైర్లు వేస్తూ పబ్బం గడపటం అధికారపార్టీకి తగదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వరద ఉద్ధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మానేసి, కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ చంద్రబాబు ఇంటి మీదే డ్రోన్లు ఎగరేసి చూడటం ఇదేనా మంత్రుల బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు.

రాజకీయాలకు సమయమా ఇది అంటూ మండిపాటు ... సహాయం చెయ్యండి అన్న పవన్ కళ్యాణ్
వరద ఉద్ధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని, అందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదన్న పవన్ కళ్యాణ్ ముందు ప్రజలకు కావలసింది చూడాలని, వారిని కాపాడాలని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించి ఆదుకోవాలని పవన్ సూచించారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముంచేస్తారా? అంటూ ప్రతిపక్ష నేతలు, మునిగిందా?లేదా? అని చూసేందుకు అధికార పక్షం నేతలు వెళ్లి రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలు ఈ సమయంలో కాదంటూ హితవు పలికారు. రాజకీయాల్లో కక్షసాధింపు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలని పేర్కొన్నారు. 151 స్థానాలు ప్రజలు వైసీపీకి అందించింది అందుకేనా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించటం అధికారపార్టీకి తగదన్నారు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం కోరుకుంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముంపుకు గురైన గ్రామాలలో ముందు ప్రజలకు కావలసిన తక్షణ సాయం అందించాలని అధికారపార్టీకి గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications