బీజేపీ నిర్ణయంతో పవన్ "లాక్" - కేసీఆర్, జగన్ చేతికి బ్రహ్మాస్త్రం..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీ పైనా ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణ పోటీ నుంచి టీడీపీ తప్పుకున్న వేళ..పవన్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారుతోంది. ప్రధాని తో కలిసి సభలో పాల్గొన్న పవన్ బీజేపీ తెలంగాణలో బీసీ సీఎం నినాదానికి పవన్ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఇదే ఏపీలో పవన్ ను టార్గెట్ చేసేందుకు రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతోంది.
బీజేపీ - జనసేన పొత్తు : తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నిర్ణయం ట్రంపు కార్డుగా భావిస్తోంది. తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అదే సమయంలో టీడీపీ నేతలు, మద్దతు దారులు అక్కడ కాంగ్రెస్ కు సహకరిస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బీజేపీ నేతలు ఇదే అంచనాతో ఉన్నారు. ఈ సమయంలోనే జనసేన - బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాయి. సీట్ల ఖరారు పూర్తయింది.

తాజాగా ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియంలో పాల్గొన్న బీసీ సభలో పవన్ మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. బీసీ సీఎం నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ తనకు అన్నగా పేర్కొన్నారు. ప్రధాని సైతం పవన్ తోడుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బీసీ నినాదం అక్కడే పరిమతమా : బీజేపీకి మద్దతు ద్వారా ఇప్పుడు పవన్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు టార్గెట్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదానికి మద్దతు ఇస్తున్న పవన్..ఏపీలో ఎందుకు బీసీ సీఎం చేయాలని కోరటం లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ది సీఎం అవుతారని ప్రకటించారు.
ఆర్ క్రిష్ణయ్య పేరును ప్రతిపాదించారు. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయగా..జనసేన మద్దతుగా నిలిచింది. ఆ ఎన్నికల్లో ఏపీలో గెలిచిన చంద్రబాబు సీఎం అయ్యారు. నాడు చంద్రబాబు నిర్ణయం..నేడు బీజేపీ నినాదానికి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు అస్త్రంగా మారుతోంది. తెలంగాణలో బీసీ సీఎం కావాలంటున్న పవన్..ఏపీలో తనకు బలం ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఈ డిమాండ్ చేయరనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.

ఏపీ ఎన్నికలపైనా ప్రభావం : ఏపీలో ఇప్పటికే సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకుంటూ వారి మద్దతు తిరిగి ఈ ఎన్నికల్లోనూ దక్కించుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్న పవన్ రాజకీయంగా బీజేపీ వ్యూహంలో చిక్కుకున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో బీజేపీ తమతో కలిసి వస్తుందనే నమ్మకంతో పవన్ కలిసి సాగుతున్నారనేది మరో విశ్లేషణ. అయితే, ఏపీలో టీడీపీ లోని కొందరు నేతలు బీజేపీతో కలిసేందుకు సిద్దంగా లేరు.
మూడు పార్టీలు కలిసినా..జరిగే సీట్ల షేరింగ్ కారణంగా వైసీపీకి ప్రయోజనం కలుగుతుందనే వాదన ఉంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ఓట్ బ్యాంక్ అయిన బీసీ సీఎం విషయంలో పవన్ తెలంగాణలో కోరుకుంటున్నట్లుగానే..ఏపీలోనూ డిమాండ్ చేయాలనే అంశం..ఇప్పుడు ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు..ఎన్నికల పైనా ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications