ఇప్పటానికి పవన్ మరో సాయం-ఇళ్లు కూలిన వారికి లక్ష చొప్పున నగదు-త్వరలో మరో టూర్
జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు స్ధలమిచ్చి వివాదాలకు కేంద్రంగా నిలిచిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ ఇవాళ మరో సాయం ప్రకటించారు. రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ సర్కార్ కూల్చేసిన ఇళ్లకు లక్ష రూపాయల చొప్పున సాయంచేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించారు.
మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు - JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/yrAFw93Sfz
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2022
మార్చి 14 తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం పోలీసులు, జేసీబీల సాయంతో ఇళ్ళు కూల్చేశారని ఆయన తెలిపారు. ఈ సంఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనట్లు సామాజిక మాధ్యమాల గణాంకాలు తెలియచేస్తున్నాయన్నారు.
ఇప్పటం ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారని నాదెండ్ల తెలిపారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారన్నారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారన్నారు. నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారని నాదెండ్ల వెల్లడించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా వారికి అందచేస్తారన్నారు.