పొత్తులపై పవన్ కొత్త ఫార్ములా, టీడీపీలో టెన్షన్ - ఢిల్లీ కేంద్రంగా..!!
జనసేనాని పవన్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతామని స్పష్టం చేసారు. అదే సమయంలో పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి. పవన్ టీడీపీతోనే కొనసాగుతారని భావిస్తున్న సమయంలోనే..బీజేపీతో ప్రభత్వ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల గురించి చేసిన కామెంట్స్ తో ఏపీ రాజకీయంలో కొత్త చర్చ మొదలైంది.
పవన్ కీలక వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్ విశాఖ కేంద్రంగా పొత్తులపైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీని ఓడిస్తామనే తన లక్ష్యాన్ని వివరిస్తూనే పొత్తులు..ప్రభుత్వ ఏర్పాటు పైన కొత్త చర్చకు కారణమయ్యారు. పొత్తులపై ఆసక్తి కర ఫార్ములా బయటకు తీసుకొచ్చారు. వచ్చేది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా.. లేదంటే మిశ్రమంగా టీడీపీతో జనసేన కలిసిన సంకీర్ణ ప్రభుత్వమా అనే అంశంపై, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

దీని ద్వారా అనేక సందేహాలు మొదలయ్యాయి. పవన్ ఆశిస్తున్నట్లుగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడే అవకాశాలు లేవనే అభిప్రాయానికి పవన్ వచ్చారా అనే చర్చ మొదలైంది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గతంలో చెప్పిన పవన్, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీసాయి.
జనసేనాని కొత్త ఫార్ములా: బీజేపీ, జనసేన ప్రభుత్వం అంటూ పవన్ తొలి సారి వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు టీడీపీలోనూ అనుమానాలు పెంచుతోంది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి జనసేనను ఆహ్వానించిన బీజేపీ, పాత మిత్రుడు చంద్రబాబును పిలవలేదు. అయితే, ఈ రెండు పార్టీలను కలిపి 2014 తరహాలో ఏపీలో పొత్తుల దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా ఆ దిశగా ప్రయత్నాలు సఫలం కావటం లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. లేక, టీడీపీ పైన పట్టు పెంచుకొనే క్రమంలో పవన్ వ్యూహాత్మకంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని టీడీపీ సీనియర్లలో మరో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పట్టు పెంచుకొనేలా..కీలక పాత్ర: వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 25 సీట్లకు పరిమితం చేయాలని టీడీపీ భావిస్తోంది. జనసేన నుంచి సాధ్యమైన మేర సీట్లు సాధించాలనే అభిప్రాయంతో ఉంది. ఈ క్రమంలో జనసేనతో టీడీపీ పొత్తు అవసరాన్ని తమ అవకాశంగా మలచుకోవాలనేది పవన్ ఆలోచనగా స్పష్టం అవుతోంది.
ఈ క్రమంలో అటు బీజేపీ, ఇటు టీడీపీతోనూ పవన్ రాజకీయంగా కొత్త ఫార్ములాతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకపోతే..చివరకు పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ నేతుల ఇప్పటి వరకు చెబుతున్న వ్యాఖ్యలకు కొనసాగింపుగానే పవన్ తాజా కామెంట్స్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications