కాపు నేతల పోరులో లాభపడుతున్నదెవరు ? తోట త్రిమూర్తులు సూచన వెనుక ?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు కాపు నేతగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నుంచి పెను సవాల్ ఎదురవుతోంది. పవన్ తనపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు లేఖలు రాస్తూ నేరుగానే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టిన ముద్రగడ ఇప్పుడు పవన్ కు కొరకరాని కొయ్యగా మారబోతున్నారు. దీంతో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మరో కాపు నేత హరిరామజోగయ్య రంగంలోకి దిగారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అధికార వైసీపీకి వ్యతిరేకంగా సాగుతుందని భావిస్తున్నా, మధ్యలో ఎంటరైన ముద్రగడ పద్మనాభం కారణంగా దీని దిశ మారిపోయింది. ఇప్పటికీ పవన్ అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నా మధ్యలో ముద్రగడ అంశం తెరపైకి వస్తూనే ఉంది. పవన్ వ్యాఖ్యలపై ముద్రగడ పదే పదే స్పందించి లేఖలు రాయడం చూస్తుంటే ఆయన వెనుక వైసీపీ ఉందన్న చర్చను జనసేన తెరపైకి తెస్తోంది. అలాగే ఇతర కాపు నేతల నుంచి కూడా ఇదే విధమైన వాదన వినిపిస్తోంది. దీంతో ముద్రగడకూ,తమకూ ఎలాంటి సంబంధం లేదని తిరిగి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు.

పవన్, ముద్రగడ పోరులో కాపు నేతల నుంచి పవన్ కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ముద్రగడకు అండగా కొందరు స్ధానిక నేతలు, వైసీపీలో ఉన్న కాపు నేతలు మాత్రమే బయటికి వస్తున్నారు. అలాగే మరో కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యవంటి వారు కూడా పవన్ సీఎం అయ్యే అవకాశాల్ని ముద్రగడ దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో సహజంగానే ముద్రగడతో పోరు పవన్ కే లాభించేలా ఉంది. అయితే ఇప్పటికే పార్టీలుగా చీలిపోయిన కాపుల్లో మరికొందరు మాత్రం ఈ పోరు వైసీపీకి లాభం చేస్తుందనే వాదన వినిపిస్తున్నారు.
ఈ పరిస్ధితిని గమనించిన వైసీపీ ఎమ్మెల్సీ, కాపు నేతగా పేరున్న తోట త్రిమూర్తులు రంగంలోకి దిగారు. పవన్, ముద్రగడ వార్ కు ఇవాళ్టితో ముగింపు పలకాలని ఆయన నిన్న సూచించారు. దీంతో వీరిద్దరి వార్ కారణంగా కాపులకు జరుగుతున్న నష్టాన్ని ఆయన నివారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముద్రగడను కూడా ద్వారంపూడి విషయంలో సమర్ధించేందుకు తాను సిద్ధంగా లేనట్లు తోట త్రిమూర్తులు చెప్పేయడంతో ఆయన స్టాండ్ ఏంటన్నది కూడా తేలిపోయింది. అంతిమంగా కాపుల్లో ఐక్యత లేకపోతే వైసీపీకే ప్రయోజనం అనే అంశాన్ని తోట పరోక్షంగా చెప్పినట్లయింది.












Click it and Unblock the Notifications