పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమో, ఆడపిల్ల మీద చేతులేస్తారా..: పవన్ వార్నింగ్, జగన్ మీద దాడి ఇష్యూపై..
పిఠాపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే జగన్ పైన జరిగిన దాడి కేసును పెద్దదిగా చేశారన్నారు.
ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమో
శ్రీపాద వల్లభుడు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు ఉంటే తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తానేమోనని చెప్పారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలనేది భగవంతుడి ఆజ్ఞ అయితే చూద్దామన్నారు. చాలామంది తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని చాలామంది అడుగుతున్నారని చెప్పారు. అయితే పోటీ తన నిర్ణయం కాదని, సెలక్షన్ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేసుకొని చెబుతుందన్నారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నియోజకవర్గాలలో కూడా తనను పోటీ చేయమని కోరుతున్నారని చెప్పారు. అన్ని చోట్ల పోటీ చేయమని చెబుతున్నారని, కానీ నిర్ణయించుకోలేదన్నారు.
Recommended Video
చంద్రబాబును చూస్తే బాధేస్తోంది
2014లో టీడీపీకి మనం అండగా నిలబడ్డామని, జన సైనికులను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం చూస్తుంటే బాధేస్తోందని పవన్ అన్నారు. జవాబుదారీతనం లేని పరిస్థితుల్లో జనసేన పుట్టుకు వచ్చిందని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, అందుకే మూడు ఎన్నికల్లో చోటు దక్కలేదన్నారు. అందుకే జనసైనికుల్ని కాదని కాంగ్రెస్తో వెళ్లిన సీఎంను చూస్తుంటే బాధ వేస్తోందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. పంచాయతీకి కూడా పోటీ చేయని లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీ మోసం చేసాయని, వదిలి పెట్టేది లేదన్నారు. మోడీ అంటే తనకు భయం లేదన్నారు. తానేం అతని దత్తపుత్రుడిని కాదన్నారు.
జగన్ దాడిపై ఆసక్తికర వ్యాఖ్యలు
చురకత్తి, కోడికాలికి కట్టే కత్తితో రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందని, వాటితో రాజకీయం కూడా మారిందని పవన్ ఎద్దేవా చేశారు. మొన్న జగన్పై ఒక కోడికి కట్టే చురకత్తితో దాడి జరిగితే ఆయన పడిన బాధ వర్ణణాతీతమని, చాలా బాధ కలిగిందన్నారు. చిన్న చురకత్తి చుట్టూ వైసీపీ, టీడీపీ వారు ఎంత రాజకీయం చేశారన్నారు. ఒకరు సీబీఐ విచారణ అంటే, ఇంకొకరు జనసైనికుడు చేశారని అంటారని విమర్శించారు. ఎవడు ఎవడితో రంకు చేసినా జనసేనదే బాధ్యత అంటే ఎలాగని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అండగా నిలబడతారనుకుంటే చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం, జగన్ది పదవి వ్యామోహమని, అందుకే ప్రజలకు అండగా ఉండటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అరుపులతో మార్పు రాదని, ఆలోచనలతో మార్పు వస్తుందన్నారు.
ఆడపిల్ల మీద చేతులేస్తారా.. తోలు తీస్తాం
పిఠాపురం ఎమ్మెల్యే వర్మ.. ఏమైనా రాజు అనుకుంటున్నారా, ఆడపిల్ల మీద చేతులు వేస్తారా, పిచ్చి పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తాం.. జాగ్రత్త అని పవన్ హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. మా ఓటు అనే బోటు మీద టీడీపీ తీరం దాటి వచ్చిందని, ఇష్టారాజ్యంగా దోచుకుంటే ఊరుకుంటామా అన్నారు. ఎమ్మెల్యే వర్మ పేకాట క్లబ్బులు నడుపుతారని, అందరినీ దూషిస్తారని, ఎదురు తిరిగే సమయం వచ్చిందన్నారు.