Pawan Kalyan : జగన్ ఓ వ్యాపారి, మరో అవకాశం ఇస్తారా ? వైజాగ్ లో డోస్ పెంచిన పవన్ ..!
వైజాగ్ లో వారాహి మూడో దశ యాత్రను ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నగరంలోని జగదాంబ సెంటర్ లో కిక్కిరిసిన అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చిన వేళ.. పవన్ కళ్యాణ్ తాను వైజాగ్ లో ఒకప్పుడు సినీ నటుడిగా ఎలా షూటింగ్స్ చేశానో, ఇప్పుడు ఎందుకు జనం మధ్య నిలబడి మాట్లాడుతున్నానో వివరించారు. తనకు ధైర్యం ఇచ్చింది వైజాగ్ అన్నారు.తనకు నటనలో ఓనమాలు నేర్పిన విశాఖకు, ఉత్తరాంధ్రకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం ఉదయం పథకం కింద డబ్బులిచ్చి, సాయంత్రం సారా కింద పట్టుకుపోతోందని పవన్ ఆరోపించారు. విశాఖ ప్రశాంతమైన నగరం అని, అలాంటి విశాఖ ఇప్పుడు గూండాలు, కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రాబందుల మధ్య ఇరుక్కుని విలవిల్లాడుతుందన్నారు. మిమ్మల్ని బెదిరించే గూండాలు, రౌడీలు ఉన్న నగరంలో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకూ మీకు ఏమీ కాదని భరోసా ఇచ్చారు. గద్దర్ చివరి రోజుల్లో కాలం గొప్పదంటూ చేసిన వ్యాఖ్యల్ని పవన్ గుర్తుచేసుకున్నారు.

జగన్ కో, ఆయన గూండాలతో, ఆయన్ను సమర్ధించే వ్యవస్ధకో భయపడొద్దని వైజాగ్ వాసుల్ని పవన్ కోరారు. అందరినీ జగన్ భయపెడతానంటే తాము భయపడాలా అని ప్రశ్నించారు. తాను ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భయాలు లేవన్నారు. ప్రజాబలం ఉన్న తనలాంటి వారు కూడా తెగించకపోతే ఆంధ్రా అధోగతి అయిపోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రం పొట్టి శ్రీరాములు బలిదానం మీద ఏర్పడిందని, ఆయనకు గుర్తింపు ఉండదు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం తెచ్చిన వారిని వదిలి దోచుకున్న వారి విగ్రహాలు కట్టిస్తున్నారని పవన్ విమర్శించారు.
తాను సీఎం కావాలని తాను అనుకుంటే సరిపోనని, మీరు అనుకోవాలని పవన్ ప్రజలకు సూచించారు. తాను ఉన్నది ఎవరో కొద్దిమంది కూర్చుని ఇష్టారాజ్యంగా పాలిస్తాం, మీరు బానిసలు అంటే చొక్కా పట్టుకుని ప్రజలకు మీరు బానిసలు అని నిరూపిస్తాం. తాను ఒక్క మాట మాట్లాడితే వైసీపీ నేతలు గయ్యిన లేస్తున్నారని, తాను వీరికి భయపడనన్నారు. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న తనకు ఎంత ధైర్యం ఉంటుందని పవన్ ప్రశ్నించారు. వైసీపీని ఆంధ్రా నేల నుంచి తన్ని తగలేసే వరకూ, ఉత్తరాంధ్ర వైసీపీ నుంచి విముక్తం చేసే వరకూ జనసేన పోరాడుతూనే ఉంటుందన్నారు.
వైసీపీకి ఓటేయకండని గత ఎన్నికల్లో వైజాగ్ ప్రజలకు తాను చెప్పానని, గాజువాకలో ఓడినా తనకు బాధ లేదని, ఎలాంటి వ్యక్తిని గద్దెనెక్కించారో మీకు తెలియదని పవన్ అన్నారు. ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఐదేళ్లు బాధ పడాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.5 లక్షల ఉద్యోగాలిస్తానన్నారని, స్టీల్ ప్లాంట్ కాపాడతానన్నారని, సీపీఎస్ రద్దు అన్నారని, ఇవన్నీ జరిగాయా అని ప్రశ్నించారు. తెలంగాణ రావడానికి జగన్ కూడా ఓ కారణం అన్నారు. రుషికొండను చెక్కేశారని, ఇక్కడ లక్ష మంది 10 మందిని ఆపలేరా అని ప్రశ్నించారు. దేశంలో సహజ వనరులు అందరివీ అని, వాటిని రాజ్యాంగం అందరి కోసం ఇచ్చిందని, జగన్ కోసం మాత్రమే కాదన్నారు.
తాను ఓడిపోయాక తిరిగి జీవం పోసింది తన విశాఖపట్నమేనన్నారు. ఓడిపోయాక మంగళగిరిలో కూర్చుంటే భవన నిర్మాణ కార్మికులు వచ్చి ఇసుక ఆపేశారని తనకు వచ్చి ఫిర్యాదు చేశారని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వెయ్యి మందే ఉన్నారని చెప్పినా వైజాగ్ కు వచ్చానని, కానీ ఇక్కడ ఎయిర్ పోర్టుకు రాగానే భారీగా జనం వచ్చారన్నారు. కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డానని, ఓడిపోతే భుజం తట్టి గుండెలో పెట్టుకున్న విశాఖ ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. తాను ఏదీ ఆలోచన, అవగాహన లేకుండా, అధ్యయనం చేయకుండా మాట్లాడనని, 30 వేల పైచిలుకు అమ్మాయిల అదృశ్యం అయ్యారని చెబితే వైసీపీ గూండాలు తిట్టారని, కానీ పార్లమెంటులో కేంద్రమే వివరాలు ఇచ్చిందన్నారు.
ఏపీలో అత్యధిక హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్ధి చెప్పారని, ఇందులో విశాఖ అగ్రభాగాన ఉందని పవన్ ఆరోపించారు. వాలంటీర్లు తనకు అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లని, వారిపై తనకు ద్వేషం లేదని సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నానన్నారు. జగన్ మీతో తప్పులు చేయిస్తున్నాడని ఆరోపించారు. మీరు వ్యక్తిగత వివరాలు అడగకూడదని, ఆ డేటా ఎక్కడికి వెళ్తుందనేది చూడటం లేదన్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడాకు ఈ డేటా వెళ్తోందన్నారు. ఆధార్ డేటా ఎందుకివ్వాలనే చర్చ దేశంలో జరుగుతోందన్నారు.
జగన్ అందరినీ అన్నా అంటారని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లను అన్నా, అక్కా అంటూనే సంతకాలు పెట్టిస్తారని, అలా అన్న వాళ్లే సీబీఐ కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చారని పవన్ విమర్శించారు. జగన్ మాటలకు పడిపోవద్దని అధికారుల్ని పవన్ కోరారు. గతంలో వైజాగ్ లో మీరే లేకపోతే వీళ్లు తనను ఏం చేసేవారో అని పవన్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో వాలంటీర్లపై తాజాగా నమోదైన కేసుల్ని పవన్ వివరించారు. వాలంటీర్లపై తన వ్యాఖ్యల్ని చిత్తూరు ఎస్పీ ప్రశ్నించారని, ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న అరాచకాలపై ఆయన ఏం సమాధానం చెప్తారని పవన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో 30 వేలకు పైగా మహిళలు అదృశ్యమైతే జగన్ ఎందుకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిపోయిందని, వైసీపీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని చంపేసి కార్లో డోర్ డెలివరీ చేస్తే, వైజాగ్ లో ఓ రౌడీ షీటర్ ఓ ఎంపీ కుటుంబాన్ని బంధిస్తే దిక్కులేదని, ఇలాంటి వాళ్లను ముఖ్యమంత్రి మద్దతిస్తాడని పవన్ విమర్శించారు. అలాంటి వాళ్లు మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పరిస్దితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా చెత్త ఛార్జీలు విధిస్తున్నారని, కరెంటు ఛార్జీలు పెరిగాయని, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు.
ఆంధ్రా యూనివర్శిటీని గంజాయి అమ్మకాల కేంద్రంగా మార్చారని, వర్శిటీలో వైసీపీ నేతలు పుట్టినరోజులు చేసుకుంటున్నారని, అధ్యాపకుల పోస్టులు ఖాళీ అయితే నింపడం లేదని, వీసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి ఓట్లు వేయించాడని పవన్ ఆరోపించారు. కేంద్రానికి ఆంధ్రా యూనివర్శిటీ వీసీపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానన్నారు. పీహెచ్డీ విద్యార్ధులకు ప్రోత్సహం లేదని, 76వ స్ధానానికి పడిపోయిందని పవన్ విమర్శించారు. ఆంధ్రా వర్సిటీని జగన్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. జనసేన ప్రభుత్వం రాగానే ఏయూని ప్రక్షాళన చేస్తామన్నారు.
కేంద్రంతో నిన్న ఆటాడించకపోతే చూడు అని పవన్ హెచ్చరికలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ అతలాకుతలం చేస్తున్న ప్రతీ ఒక్కరి ఫైల్ కేంద్రం దగ్గర ఉందని, వారికి భవిష్యత్తులో చరమాంకం పాడతామన్నారు. విశాఖ సంఘ విద్రోహక శక్తుల అడ్డాగా మారిందని, భూముల స్కాం, కల్తీమందులు ఎక్కువయ్యాయని హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలు పవన్ గుర్తుచేశారు. అమ్మఒడి అని మాట్లాడుతున్నారని, 3 లక్షల విద్యార్ధులు డ్రాప్ అవుట్ అయ్యారని, 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కానీ దివాళా తీసిన బైజూస్ కు 500 కోట్లు ఇచ్చారని పవన్ విమర్శించారు.
జగన్ సమస్య ఏంటని, ఆయన నాయకుడు కాదని వ్యాపారి అని పవన్ ఆరోపించారు. జగన్ కమీషన్ ఏజెంట్, వ్యాపారిగా మారిపోయారన్నారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా వాటా అడుగుతున్నారని విమర్శించారు. జగన్ కు డబ్బు పిచ్చిగా మారిందని, ఎంత డబ్బు తింటావు, ఎన్ని వేల కోట్లు తింటావని ప్రశ్నించారు. డబ్బు కట్టలతో తాలింపు వేసి కూర పెడితే తింటావా అని పవన్ ప్రశ్నించారు. అడ్డగోలుగా ఎవరి దగ్గర అయినా డబ్బు పోగు పడితే అది మిగతా వారిని అంత బానిసలుగా మారుస్తుందన్నారు. జగన్ కు మరో ఇవ్వాలనుకుంటున్నారా ఆలోచించుకోవాలన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications