'రెండో రాజధాని, పవన్ వైఖరి చెప్పాలి: బీజేపీ డిమాండ్, 'బీజేపీలో వైసీపీ విలీనానికి ఒప్పందం'
హైదరాబాద్: రాయలసీమలో కరువు, వెనుకబాటుతనంపై పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేసుకున్నారని బీజేవైఎం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి శనివారం ప్రశ్నించారు.
రాయలసీమ భవిష్యత్తుపై వైసీపీతో పాటు కాంగ్రెస్, సీబీఐ, సీపీఎం, జనసేన పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కాగ్ బయట పెట్టిందని, కాబట్టి గంటసేపు కూడా ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత ఆ పార్టీకి లేదన్నారు.
మోడీ నా జూనియరైనా సార్ సార్ అన్నాను: బాబు, పవన్! నీకు అలవాటేమో, అవమానిస్తావా: శివాజీ షాక్
కేంద్రం నుంచి నిధులు వచ్చినా వినియోగించుకోవట్లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను వంచించిన నేపథ్యంలో మరోసారి ప్రజల తీర్పు కోరాలని విష్ణు అన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని చెబితే ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు.
రెండో రాజధానిపై మీ వైఖరేంటి?
రాయలసీమలోని ప్రాంతాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలని విష్ణు డిమాండ్ చేశారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వైసీపీలు తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు.
బీజేపీలో వైసీపీ విలీనం ఖాయం
ఎన్నికల తర్వాత బీజేపీలో వైసీపీ విలీనం కావడం ఖాయమని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్యవర్తిగా ప్రధాని మోడీ, జగన్ల మధ్య ఈ మేరకు రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఎన్నికల వరకు బేషరతుగా పరోక్షంగా మద్దతిచ్చేలా ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరిందన్నారు.
అందుకే ఈడీ ఆదీనంలోని రూ.40 కోట్లు విడుదల
ఇందులో భాగంగానే ఈడీ ఆధీనంలో ఉన్న రూ.40కోట్లు విడుదలయ్యాయని ఆనందబాబు అన్నారు. జగన్ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు సైతం ఎందుకు నత్తనడకన సాగుతుందో అర్థమవుతోందన్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించి కోర్టుకు హాజరైన జగన్ నేరుగా సంగం జాగర్లమూడికి వచ్చి విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆడిపోసుకున్నారని, ప్రధాని మోడీని పన్నెత్తు మాటా అనలేదన్నారు.