కేసీఆర్ అలా అన్నారు, పవన్ జవాబు చెప్పాలి: విజయసాయి, మోడీని ఇరుకున పెట్టొద్దని జగన్!
అమరావతి: అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ డిమాండ్ చేసింది.
ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం. అదే సమయంలో తాము స్పీకర్ కోడెల శివప్రసాద రావును కలిశామని చెప్పారు.
జగన్ దారిలో పవన్ కళ్యాణ్! అదే దారిలో.. పావులు కదుపుతున్న జగన్
రెండు అంశాలపై స్పీకర్ను కలిశాం
తాము స్పీకర్ కోడెల శివప్రసాద రావును కలిసి రెండు విషయాలపై వినతి పత్రం ఇచ్చామని విజయ సాయి రెడ్డి చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరామని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి హాజరవుతామని చెప్పామన్నారు.
రెండో విజ్ఞప్తి ఇది
మరో విజ్ఞప్తి కూడా కోడెలకు చేశామని చెప్పారు. రెండేళ్లకు పైగా శిక్ష పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అనర్హుడిగా ప్రకటించాలని తాము కోరామని విజయసాయి రెడ్డి చెప్పారు. చింతమనేని స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, చింతమనేని ప్రభాకర్ తదితర అంశాలపై సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యవహరించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ అన్నారు, పవన్ సమాధానం చెప్పాలి
ప్రత్యేక హోదా, అవిశ్వాసం, థర్డ్ ఫ్రంట్ అంశాలపై కేసీఆర్ మాట్లాడిన అంశాలపై విజయ సాయి రెడ్డి స్పందించారు. మూడో కూటమిపై కేసీఆర్ స్పష్టంగా చెప్పలేదన్నారు. అవిశ్వాసం చీఫ్ పాలిటిక్స్ అని కేసీఆర్ అన్నారని, దానిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ డిమాండ్ వింతగా ఉందని, కేసీఆర్ను ప్రశ్నించకుండా పవన్ను అడగటం ఏమిటని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాలి
ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం సరికాదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, మరి ఎప్పుడు పెట్టాలో ఆయన చెబితే మంచిదని విజయ సాయి రెడ్డి అన్నారు. కాగా, 21న అవిశ్వాసంపై జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. మార్చి 21న అవిశ్వాసం పెట్టగానే స్పీకర్ దానికి అనుమతించరు. నిబంధనల మేరకు తీర్మానాన్ని అంగీకరించిన పది పని దినాల్లో ఎప్పుడైనా స్పీకర్ చర్చకు సమయం కేటాయించవచ్చు. ఏప్రిల్ 6న సమావేశాలు ముగుస్తున్నాయి. వైసీపీ మార్చి 21న అవిశ్వాసం పెడితే సరిగ్గా 10వ పని దినాన సభ ముగుస్తుంది. ఆర్థిక పద్దులు, ట్రిపుల్ తలాక్, ఆర్థిక నేరాల బిల్లు, బీసీ కమిషన్కు చట్టబద్దత కల్పించే బిల్లు వంటి కీలక బిల్లులపై చర్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 21 తర్వాత సమయాభావం వల్ల అవిశ్వాసానికి స్పీకర్ అంగీకరించరని, ఈ లెక్కలు వేసుకొని వైసీపీ ఆ రోజును ఎంచుకుందని అంటున్నారు. బీజేపీని ఇబ్బంది పెట్టవద్దనే అలా నిర్ణయించుకున్నారని తెలుస్తోందని అంటున్నారు.