pawan kalyan: విధ్వంసం, విచ్ఛిన్నం, కక్షసాధింపు, జగన్ ఆర్నెల్ల పాలనపై జనసేనాని ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆరునెలల పాలనపై ట్వీట్లు సంధించారు. ఆర్నెల్ల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుకుడుతనం, కక్షసాధింపు, మానసిక వేదన, అనిశ్చితి, విచ్చిన్నం అని పవన్ ఫైరయ్యారు.
సీఎం కేసీఆర్కు పవన్ కళ్యాన్ ట్విట్టర్ విజ్జప్తి...సానుభూతితో కార్మికులను విధుల్లోకి తీసుకోండి
విధ్వంసం
సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టకా జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని పవన్ కల్యాణ్ విమర్శించారు. వరదనీరు పేరుతో కూల్చివేతకు తెరతీశారని విమర్శించారు. వరదనీరును తన స్వార్థ రాజకీయం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చి ఎలాంటి సంకేతాలను ఇచ్చారని ప్రశ్నించారు. ఇది విధ్వంస బుద్ధికి అద్దం పడుతుందని గుర్తుచేశారు.
దుందుకుడుతనం
అమరావతి రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలగడం, కాంట్రాక్టు రద్దు చేయడం సీఎంగా జగన్ దుందుకుడుతనానికి నిదర్శమని పవన్ అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ రద్దు సరికాదని కామెంట్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల నుంచి సింగపూర్ తప్పుకోవడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అయినా జగన్ మాత్రం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు.
కక్షసాధింపు చర్యలు
తన ప్రత్యర్థులను వేధించడం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఒకరు, ఇద్దరు అని కాదు.. ప్రతీ ఒక్కరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డరని విమర్శించారు. శ్రీకాకుళంలో సామాన్య కార్యకర్తను కూడా విడిచిపెట్టలేదన్నారు. మరికొందరిని పోలీసు కేసులతో హరాస్ చేశారని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీద కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం హరాస్మెంట్ తాళలేక మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
బెదిరింపులు
ప్రత్యర్థులకు చెందిన తోటలను కూడా వదిలిపెట్టలేదని పవన్ గుర్తుచేశారు. బత్తాయి తోటలను నరికేశారని ఆరోపించారు. దుగ్గి మండలంలో గల గ్రామాల్లో పురుషులను ఖాళీ చేయించారని గుర్తుచేశారు. వైసీపీకి ఓటేయని వారిని బెదిరించి, భయపెట్టడం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేసినా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. చట్టాల ముసుగులో జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తున్నారని పేర్కొన్నారు. చానెల్స్ బ్యాన్ చేయడం వెనక ఆంతర్యం ఏటిమని ప్రశ్నించారు.
అనిశ్చితి
ఏపీలో అనిశ్చితి నెలకొందని పవన్ పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి కాదు.. ఆర్థిక అనిశ్చితి అని పేర్కొన్నారు. రాష్ట్రానికి 40 వేల కోట్లపైగా అప్పులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారిని పంపించేశారని విమర్శించారు. ఇకపై ఎవరూ ముందుకొస్తారని ప్రశ్నించారు. మన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. ఇంతకీ అమరావతి రాజధానిగా ఉంటుందా అని పవన్ ప్రశ్నించారు. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నవరత్నాలకి నిధులు ఉన్నాయా అని అడిగారు.
విచ్ఛిన్నం
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పి తెలుగు భాషను, సంస్కృతి, భారతీయత సనాతన ధర్మం విచ్చిన్నతకి శ్రీకారం చుట్టారని పవన్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధనతో తెలుగు కనుమరుగైపోతుందన్నారు. 151 అసెంబ్లీ స్థానాలు గెలిచిన వైసీపీ ఇకనైనా తన ధోరణిని మార్చుకోవాలని సూచించారు. జగన్ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.