జెసి వెనుక మీరే: సునిత, తెలియదు: పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లాలో స్కూలు పిల్లాడిని అడిగినా జెసి టిడిపిలో చేరే వ్యవహారం వెనుక కేశవ్ ఉన్నారనే అంటున్నారని సునిత అనగా.. ఒక్క శాతం కూడా తనకు సంబంధం లేదని, అయినా పార్టీ కోసం కొన్ని నిందలు మోయాల్సి వస్తుందని పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.
తాము కోరిన సమాచారం ఇస్తే విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని పయ్యావుల కేశవ్ వేరుగా ప్రకటించారు. తమకు ఏం సమాచారం కావాలో గతంలోనే లిఖిత పూర్వకంగా కోరామని, దానిని ఇంతవరకూ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని, రేపైనా ఇస్తే తాము సభలో దీనిపై చర్చలో పాల్గొంటామని, ప్రభుత్వానికి బుధవారం వరకూ గడువు ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నిజంగా సమైక్యవాది అయితే దీనికి ముందుకు రావాలన్నారు.
ఆయన సమైక్యవాదం నేతి బీరకాయో లేక నిజమో దీనితో తేలుతుందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ సమాచారాన్ని సభ ముందు పెట్టడం లేదని, హోం మంత్రిత్వ శాఖకు రాశామని చేతులు దులుపుకొంటోందని ఆరోపించారు. బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను సభ్యులకు ఇవ్వలేదని, ఈ చర్య వల్ల పడే ఆర్థిక భారంపై వివరణ పత్రం ఇవ్వలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరుతున్నట్లు సమైక్య తీర్మానం చేయడానికి తమకు అభ్యంతరం లేదని, చేసి దానిని ఎవరికి పంపాలని ప్రశ్నించారు.