ఫలితాలపై చంద్రబాబు, టిపైనా: సిద్ధం కాలేదని జగన్పార్టీ
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రాత్మకం అన్నారు. అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. సీమాంధ్ర ప్రజలు తమ ఓటు ద్వారా అవినీతికి గుణపాఠం చెప్పారని, అభివృద్ధికి పట్టం గట్టారని చంద్రబాబు అన్నారు.
ప్రజలందరికీ తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమష్టి కృషి, పార్టీ విధానం వల్లనే తాము విజయం సాధించామని చెప్పారు. తెలంగాణను తామే తెచ్చామని కాంగ్రెసు పార్టీ చేసిన ప్రచారం వల్లనే తెలంగాణ ప్రాంతంలో ఓటర్లు ప్రభావితమయ్యారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పారు.

టిడిపి హవాకు నిదర్శనం: గంటా
సీమాంధ్రలో టిడిపి హవాకు మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ప్రజలు టిడిపి వెంటే ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లోను ఇదే పునరావృతం కానుందని చెప్పారు.
మే 16వ విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికలలోను ఇవే ఫలితాలు వస్తాయని టిడిపి నేత రాయపాటి సాంబశివ రావు చెప్పారు. గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో తమ పార్టీయే గెలుపొందిందని చెప్పారు. కాగా, మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తాము సిద్ధం కాలేకపోయామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తామే గెలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications