కాన్వాయ్ పై రాళ్ల దాడి.. పోలీసుల విచారణలో తేలిందేమిటంటే..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నందిగామలో పర్యటించిన సందర్భంలో ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. డీసీపీ విశాల్ గున్ని పర్యవేక్షణలో సిట్ లు పని చేస్తాయని పోలీసు కమీషనర్ కాంతి రాణా తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఎత్తయిన భవనాల నుంచి ఈ రాళ్లను విసిరినట్లు తేలింది. సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోని భవనాల నుంచే రాళ్లు వచ్చాయని పోలీసులు భావిస్తున్నారు.
వారు ఘటనా స్థలాన్ని పరిశీలించడమే కాకుండా అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజిని పరిశీలిస్తున్నామని, ఆ పర్యటనలో తీసిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని కమిషనర్ తెలిపారు.
నందిగామలో పార్టీ కార్యాలయానికి వెళుతున్న క్రమంలో జగ్గయ్యపేట వద్ద టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాన్వాయ్ పై రాళ్లను విసిరారు. చంద్రబాబు భద్రతాధికారికి గాయాలయ్యాయి.
దీనిపై బాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. తనది విజన్ అయితే.. జగన్ ది విధ్వంస పాలన అని, రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.