వ్యభిచార ముఠా పట్టివేత: పోలీసులకు చిక్కిన జూ.ఆర్టిస్ట్
హైదరాబాద్: వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఓ జూనియర్ ఆర్టిస్టు పట్టుబడింది. సైబరాబాద్ పోలీసులు మంగళవారంనాడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూనియర్ ఆర్టిస్టుతో పాటు ఇద్దరు విటులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదు శివారులోని ఉప్పల్, భరత్ నగర్ ప్రాంతాల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ అనూష అనే ఆర్టిస్టుతో పాటు ఇద్దరు విటులను స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పట్టుకుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ఇదిలావుంటే, హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటిన్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహేష్, భావేష్ మట్ల అనే ఇద్దరిని అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద అక్రమంగా తెచ్చిన బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.
సప్తగిరి చానెల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 15 మంది యువతుల నుంచి నిందితుడు 7 లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.