'మద్రాస్లోని భూముల్నీ దోస్తున్న బాబు, దోచుకుంటున్న లోకేష్'
గుంటూరు: అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా మద్రాసులో ఉన్న 471 ఎకరాల సదావర్తి సత్రం భూములను టిడిపి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు సీ రామచంద్రయ్య, రఘువీరా రెడ్డిలు బుధవారం నాడు మండిపడ్డారు.
రూ.6 కోట్ల విలువైన ఎకరా భూమిని రూ.27 లక్షలకే వేలం వేయడం వల్ల దోపిడీకి తెరదీశారన్నారు. బుధవారం వారు గవర్నర్ నరసింహన్ను కలిశారు. టిడిపి నేతలకే ఆ భూములను ధారాదత్తం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ అక్రమ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, రూ.5 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు. దేవుడి భూములను వేలం వేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. రూ.5వేల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోందన్నారు.
వేలానికి సంబంధించి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా టిడిపి నేతలకు ఈ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి భూముల ఆస్తులను రక్షించుకునేందుకు ఏపీలో, తమిళనాడులో కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు.
ముద్రగడ పద్మనాభం దీక్ష విషయమై మాట్లాడుతూ... రాజమహేంద్రవరంలో ఆయనను పరామర్శించకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ముద్రగడ తనయుడిని పోలీసులు చితకబాదడం అమానుషమన్నారు. అసలు ముందు అరెస్ట్ కావాల్సిందే చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని, ఇప్పుడు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.