టిటిడికి హైద్రాబాద్ కపుల్స్ ఆభరణాల విరాళం(ఫొటోలు)
తిరుపతి: హైదరాబాద్ నగరానికి చెందిన దంపతులు షన్ముఖ, మహాలక్ష్మిలు రూ. 3.75 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ ఆభరణాలను ఊరేగింపు సమయంలో కపిలేశ్వర స్వాములవారికి అలంకరించనున్నారు.
సోమవారం తిరుపతికి వచ్చిన షన్ముఖ, మహాలక్ష్మి దంపతులు ఆలయ అధికారులకు ఈ ఆభరణాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన తరపున ఆలయ జెఈఓ భాస్కర్ ఆభరణాలను స్వీకరించారు. హైదరాబాద్ దంపతులు అందజేసిన ఆభరణాలలో కిరీటం, భుజం ఆభరణాలు, తామ్రం, నికెల్ లోహాలతో తయారు చేయబడి బంగారం పూత కలిగిన ఇతర ఆభరణాలు ఉన్నాయి.

నంది వాహనంపై ఊరేగిన కపిలేశ్వర స్వామి
శ్రీకపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నంది వాహనంపై కపిలేశ్వరస్వామి ఊరేగారు. సాయంత్రం స్వామివారికి తిరుచ్చి ఉత్సవం ఘనంగా జరిగింది. ఊరేగింపు స్థానిక ఆలయం నుంచి ప్రారంభమై అన్నారవు కూడలి, ఇస్కాన్ ఆలయం, వినాయక క్వార్టర్స్, తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరింది.

వాహనసేవ ముందు వివిధ కళాబృందాలు కోలాటాలు, చెక్కభజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన సంగీత ప్రవచనం, గాత్రం, నృత్య కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉదయం కపిలేశ్వరస్వామి వ్యాఘ్రవాహనం, సాయంత్రం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.












Click it and Unblock the Notifications