జగన్ విధేయులకు రిటైరైనా తప్పని కష్టాలు-మాజీ ఐఏఎస్ కు నెలరోజుల జైలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకున్న అధికారుల లిస్ట్ లో ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ కు హైకోర్టు నెల రోజుల జైలుశిక్ష విధించింది. ఓ కేసులో కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా వక్రభాష్యాలు చెప్పి ఉత్తర్వుల్ని పక్కనబెట్టిన వ్యవహారంలో ఆయనతో పాటు మరో అధికారికీ నెల రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
గతంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అప్పట్లో సీఎం జగన్ కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ చెప్తే చాలు నిబంధనలతో సంబంధం లేకుండా పనిచేస్తారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో 2022లో ఇంటర్ బోర్డులో విజయలక్ష్మి అనే ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యారు. అయితే అంతకు ముందే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది. దీంతో తన సర్వీస్ పొడిగించాలని ఆమె కోరారు. దీనికి విద్యాశాఖ ఒప్పుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన హైకోర్టు.. ఆమె సర్వీసు పొడిగించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న శేషగిరిబాబు.. సదరు ఆదేశాలను అమలు చేయలేదు. కంపెనీ చట్టం కింద ఏర్పడిన ఇంటర్ బోర్డు ఉద్యోగులకు 62 ఏళ్ల నిబంధన వర్తించదన్నారు. దీంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. వీరి వాదన తప్పని తేల్చింది.
ఇంటర్ బోర్డు ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయని ప్రవీణ్ ప్రకాష్, శేషగిరిబాబుకు నెల రోజుల జైలు, రెండు వేల చొప్పున జరిమానా విధించింది.
అయితే ఇప్పటికే వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ తో పాటు శేషగిరిబాబుకు అప్పీలు చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాల పాటు శిక్షను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications