తిరుమలపై తప్పుడు సమాచారంతో గందరగోళం: టీటీడీ కఠిన చర్యలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 71,249 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 22,901 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు.

కాగ- టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని అన్నారు. మీడియా ప్రతినిధుల నుండి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని, చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటం, టీటీడీ కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అభివృద్ధిపై, భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష సేవలపై ఎంతో అవగాహన ఉంటుందని తెలిపారు. టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.












Click it and Unblock the Notifications