సిఎంలని మందలించండి: రఘువీరా, ఎమ్మెల్సీలకు క్లాస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులను గవర్నర్ నరసింహన్ మందలించాలని ఎపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు. హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చక పోవడంపై ఆయన మండిపడ్డారు.
కెసిఆర్, చంద్రబాబులు గవర్నర్ వ్యవస్థకు కళంకం తెచ్చారన్నారు. వారిని గవర్నర్ మందలించి హామీలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం పరస్పరం విరుద్ధంగా ఉందని చెప్పారు.
చరిత్ర తిరగరాస్తా: మాణిక్యాల రావు
దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తే భవిష్యత్ ఉండదన్న రాజకీయ నమ్మకాన్ని తిరగరాస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వేరుగా దేవాదాయ శాఖ మంత్రిగా దేవుడికి, భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. 25 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు.
ఎమ్మెల్సీలకు నంది ఎల్లయ్య క్లాస్
తొమ్మిది మంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెరాసలో చేరేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెసు పార్టీ ఎంపీ నంది ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు అనుభవించి పార్టీ మారడం సరికాదని ఎమ్మెల్సీలకు ఆయన హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును అనుసరిస్తున్నారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సభ్యులు ఒకేలా ఉండాలని, అప్పుడే విశ్వసనీయత ఉంటుందన్నారు.
పునరాలోచించుకోవాలి: పొన్నాల
తెరాసలో చేరాలనుకుంటున్న నేతలు మరోసారి పునరాలోచించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వేరుగా అన్నారు. పార్టీ వీడాలనుకుంటున్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. తమ ఎమ్మెల్సీలకు తెరాస గాలం వేయడం సరికాదన్నారు.