పెద్ద నోట్ల రద్దుపై రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం సామాన్యుల చేతిలోకి రాకముందే కొత్త నోట్లు ఉగ్రవాదులకు చేరాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎలా జరిగిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లభ్యం నెరవేరలేదని రఘువీరా రెడ్డి అన్నారు. గతంలో లక్షలో ఒక దొంగనోటు ఉండేదని, ఇప్పుడు బ్యాంకుల్లో కూడా దొంగనోట్లు డిపాజిట్ అయ్యాయని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దయి 50రోజులు గడిచినా ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయని అన్నారు.
సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మాయల ఫకీర్లని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా దోచుకునేందుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చును పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఐదున్నర వేలకోట్లు ఖర్చు చేశామని అన్నారు.
భారీ దోపిడీలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 11వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40వేల కోట్లకు పెంచారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు వ్యయాలను ఇష్టరీతిన పెంచే హక్కు ఎవరిచ్చారని రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.