బాధే కానీ: రఘువీరా, ప్రత్యేక హోదాపై జైరాం నిలదీత
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మోసపోవద్దని, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వ ప్యాకేజీలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పోలవరం ముంపు గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం విజ్ఞప్తి చేశారు.
తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాన్ని, పుడమితల్లిని విడిచి వెళ్లడం గిరిపుత్రులకు బాధాకరమేనని, అనివార్య పరిస్థితుల్లో సమగ్రమైన ప్రత్యామ్నాయం లభిస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనుల మనోభావాలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అన్నివిధాలా ఆదుకొనేందుకు ముందుకొచ్చాయన్నారు.
పునరావాస కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు రాజకీయ నేతలు వారి స్వలాభం కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అటువంటి వారి ఉచ్చులో పడొద్దని గిరిజనులకు రఘువీరా విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు?: జైరాం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎప్పుడు ప్రకటిస్తారని రాజ్యసభలో జైరాం రమేష్ మంగళవారం ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో ఆలస్యం ఎందుకని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం పొందే సమయంలో స్వయంగా ప్రధాని ఇచ్చిన హామీని ఇంత వరకు అమలు చేస్తున్నట్లు ప్రకటించలేదన్నారు. ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే దానికి జాతీయాభివృద్ధి మండలి ఆమోదం పొందారని గుర్తు చేశారు.
ఢిల్లీలో జైరాం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నేటితో 50 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు పోలవరం అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయలేదన్నారు. వెంటనే దానిని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్లో జైట్లీ పోలవరం అథారిటీకి రూ.250 కోట్లే కేటాయించడం నిరాశకు గురి చేసిందన్నారు. కృష్ణానది బోర్డు నిర్వహణకు పూర్తిస్థాయి చైర్మన్ను నియమించాలన్నారు.