ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లే ఈ ప్రత్యేక రైలు.. డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా మార్పు
దేశంలో పండగ సీజన్ ఆరంభమైంది. దీంతో పాటే రైళ్లు ప్రయాణికుల తాకిడీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగించడం, వాటిని రెగ్యులరైజ్ చేయడం వంటి చర్యలు ఇందులో భాగంగా మారుతున్నాయి.
ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో వాటిని రెగ్యులరైజ్ చేస్తోన్నారు. ఈ క్రమంలో ఏపీ మీదుగా రాకపోకలు సాగించే మరో స్పెషల్ ఎక్స్ ప్రెస్ ను కూడా తాజాగా క్రమబద్దీకరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.

దానాపూర్ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రత్యేక రైలు ఇకపై డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మారింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దానాపూర్, 3వ తేదీ నుంచి బెంగళూరులో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా తన ప్రయాణాన్ని ఆరంభించబోతోంది. దీనికి సంబంధించిన నూతన టైమ్ టేబుల్, ఇతర వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. వాటి వివరాలిలా ఉన్నాయి.
- సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 2:45 నిమిషాలకు దానాపూర్ బయలుదేరే నంబర్ 22365 డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
- సెప్టెంబర్ 3వ తేదీ గురువారం నుంచి ప్రతి రోజూ రాత్రి 11:50 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 22366 డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 12:15 నిమిషాలకు దానాపూర్ కు చేరుకుంటుంది.
- ఆరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్ రాజ్ ఛెయోకీ, సత్నా, జబల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్ మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications