స్వామివారికి రూ.100 కోట్ల వెల కడతారా, నేలమాళిగకు దారి.. అది మూసేశారు: రమణదీక్షితులు
Recommended Video

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు గాను తనకు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసిందని చెప్పారు. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు.
తద్వారా స్వామి వారి పరువు వంద కోట్లు మాత్రమే అని తేల్చేశారని మండిపడ్డారు. అసలు తాను చేసిన ఆరోపణలు తప్పు అని టీటీడీ నిరూపించాలని డిమాండ్ చేశారు. నా ఆరోపణలకు సమాధానం చెప్పలేక పరువునష్టం దావా వేశారన్నారు. మీ తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అని నిప్పులు చెరిగారు.

ఉద్యోగం నుంచి తప్పించే అధికారం ఎవరిచ్చారు?
తనను ఉద్యోగం నుంచి తప్పించే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎవరు ఇచ్చారని రమణదీక్షితులు ప్రశ్నించారు. తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని వాపోయారు. తిరు ఆభరణాలకు లెక్క చెప్పాలన్నారు. కలియుగంలో దైవం అంటే భయం, భక్తి లేకుండా పోయిందన్నారు.

నేలమాళిగకు వంటశాల నుంచి దారి, అది మూసేశారు
వివిధ రాజవంశాలు స్వామివారికి పెద్ద ఎత్తున ఆభరణాలు సమర్పించాయన్నారు. 18 లక్షల బంగారు మొహర్లను నేలమాళిగలో భద్రపరిచారన్నారు. అమూల్యమైన నగలు ఉంచిన నేలమాళిగకు వంటశాల నుంచి దారి ఉందని చెప్పారు. గత డిసెంబర్ నెలలో ఈ వంటశాలను మూసివేశారన్నారు.

స్వామివారికి వెలకట్టిన ఘనత అధికారులదే
వెంకటేశ్వర స్వామి వెలకట్టలేని వారు అని, ఆయనకు వెలకట్టిన ఘనత టీటీడీ అధికారులకే దక్కిందని రమణ దీక్షితులు మండిపడ్డారు. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలన్నారు.

1000 ఏనుగులు, 30వేల అశ్వాలపై వచ్చిన నిధి ఎక్కడో నిక్షిప్తం చేశారు
తన ఆరోపణలు అసత్యమని తేలితే పరువు నష్టం దావా వేసుకోవచ్చు కానీ, వాటిని టీటీడీ అధికారులు నిరూపించలేకపోయారని రమణదీక్షితులు అన్నారు. శ్రీవారు అపారమైన మహిమలు గల దేవుడు అన్నారు. ఆయన గురించి పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వివరాలు తెలుసుకుంటే భక్తులకు చిత్తభ్రమ కలుగుతుందన్నారు. కృష్ణదేవరాయల వారి తర్వాత మూడవ మహారాజుగా విజయనగర సామ్రాజ్యాధిపతిగా తిరుమలరాయల వారు వచ్చారని, సుమారు 1000 ఏనుగులు, 30వేల అశ్వాలపై అమూల్యమైన సంపదను, యుద్ధ విజయాల్లో ప్రాప్తించిన సంపదను తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారని మనకు శాస్త్రాల్లో ఉందన్నారు.












Click it and Unblock the Notifications