తిరుమలలో ట్రయల్ రన్
Ratha Saptami 2025: ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి. ఈ పండగ కోసం తిరుమల ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వరు సమీక్షలు సైతం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నారు.
రథ సప్తమి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా 80 నుంచి లక్ష మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

రథ సప్తమి నాడు- తెల్లవారు జామున 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు ఊరేగుతారు. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ ఉంటుంది. మధ్నాహ్నం ఒంటిగంటకు హనుమంత వాహన సేవ, 2 గంటలకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.
సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు మలయప్ప స్వామివారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు.. చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. దీనికోసం నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోన్నారు టీటీడీ అధికారులు.
వాటన్నింట్లోనూ కీలకమైనది సర్వభూపాల వాహన సేవ. మలయప్ప స్వామివారు ఊరేగే అన్ని వాహనాల్లోకెల్లా సర్వభూపాల వాహనం అధిక బరువుతో కూడుకుని ఉంటుంది. దీని బరువు 1,020 కేజీలు. సర్వభూపాల అలంకరణ కావడం, దీనికోసం వినియోగించే వస్తువులు మిగిలిన వాటితో పోల్చుకుంటే అధికం కావడం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే- మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి దర్శనం ఇస్తారు.
అ నేపథ్యంలో రథ సప్తమి నాడు ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఉండటానికి- గురువారం నాడు తిరుమలలో సర్వభూపాల వాహన సేవ ట్రయల్ రన్ నిర్వహించారు టీటీడీ అధికారులు. ఇందులో పాల్గనే వారు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను దగ్గరుండి పరిశీలించారు.












Click it and Unblock the Notifications