ఆగస్టు 11నే స్వాతంత్ర్య దినోత్సవం! ఇంటింటికీ జెండా ఎగురవేయండి
పాకిస్థాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశం నుంచి ఇప్పటికే వేరుపడుతున్నట్లు ప్రకటించిన 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్' సమూహం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11వ తేదీని తమ అధికారిక స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటిస్తూ.. ప్రపంచ దేశాలన్నీ తమను ప్రత్యేక దేశంగా గురింపు ఇవ్వాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది.
బలూచిస్తాన్ విముక్తి పోరాట నాయకుడు మీర్ యార్ బలూచ్ ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటిపైనా, వీధులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థల్లో బలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. రాబోయే తరాలకు తమ పోరాట చరిత్రను, ఈ రోజు ప్రాముఖ్యతను గుర్తుచేసేందుకే ఆగస్టు 11న ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఈ తేదీనే తమ స్వాతంత్ర్య దినంగా జరుపుకుంటామని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి!
పాకిస్థాన్ ప్రస్తుత రూపంలో ఉన్నంత కాలం దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధ్యం కాదని బలూచ్ నాయకత్వం తేల్చిచెప్పింది. దాదాపు 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తున్నారని, అంతర్జాతీయ సమాజం కూడా తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని కోరింది. సరిగ్గా పాకిస్థాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే ముందు బలూచిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆగస్టు 11 వెనుక ఉన్న చారిత్రక కథేంటి?
బలూచిస్తాన్ ఆగస్టు 11నే ఎందుకు ఎంచుకుందనే దానికి పెద్ద చరిత్రే ఉంది. 1947లో బ్రిటిష్ పాలకులు భారత్ వదిలి వెళ్తున్న సమయంలో, ఆగస్టు 11నే బలూచిస్తాన్ మొదటిసారిగా తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ఆ రోజుల్లో 'న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికలు, అల్ ఇండియా రేడియో కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. అందుకే నాటి చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ తేదీనే తమ నేషనల్ డేగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
"పాకిస్థాన్ చరిత్రంతా హింస, విధ్వంసమే"
పాకిస్థాన్ విధానాల వల్ల కేవలం తమ ప్రాంతమే కాకుండా, ఇటు దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొందని బలూచ్ నేతలు ఆరోపించారు. 1948 మార్చిలో బలూచిస్తాన్ను ఆక్రమించుకోవడం మొదలుకొని, 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, చాగైలో అణు పరీక్షలు, ఉగ్రవాదానికి ఊతమివ్వడం వరకు పాక్ సైన్యం అనేక ప్రాంతాల్లో రక్తం ఏర్లు పారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చట్రం నుంచి బయటకు వస్తేనే ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications