ఎంపీ నిధులతో ఇంట్లోకి రోడ్డు వేయించుకున్న ఎమ్మెల్యే రాపాక
జనసేన తరఫున రాజోలు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న రాపాక వరప్రసాదరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఎమ్మెల్యే ఇంటిని నిర్మించుకున్నారు. ప్రహరీ గేట్ నుంచి ఇంటివరకు రూ.12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించారు. ఎంపీ లాడ్స్ నుంచి విడుదలైన నిధులతో ఈ రోడ్డును నిర్మించారంటూ కేశవదాసుపాలెంకు చెందిన వెంకటపతిరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
వెంకటపతిరాజు ఫిర్యాదు చేసిన మంత్రిత్వ శాఖ నుంచి విచారణ చేయాలంటూ కలెక్టర్ కు ఆదేశాలందాయి. ఎంపీ లాడ్స్ నిధులతో ఇంట్లోకి సీసీ రోడ్డు నిర్మాణంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీరాజ్ ఎస్ ఈ చంటిబాబు కూడా ధ్రువీకరించారు. ఈ రోడ్డు నిర్మాణంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలందించినట్లు వెల్లడించారు.

తనను కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని, వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని పంచాయితీకి రాసిచ్చినట్లు తెలిపారు. పంచాయితీలో తీర్మానం చేసిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ రోడ్డును ఆనుకొని కొన్ని ఇళ్లు ఉన్నాయని, అందుకే రోడ్డు నిర్మించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇటీవలే చింతలపూడి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాపాక మాట్లాడిన వీడియో వైరలైంది. దొంగ ఓట్లతో నెగ్గానని ఆయన స్వయంగా అందులో చెబుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications