టిడిపి కౌన్సిలర్ను నడి రోడ్డుపై నరికి చంపారు: కారణం అదేనా?
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాల్టీలో 16వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52) హత్యకు ఇసుక రీచ్ వ్యవహారాలే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆయన దారుణ హత్యకు గురయ్యారు.
ఒక వివాహ విందుకు హాజరై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. మెడ, భుజం, చేతులపై విచక్షణారహితంగా నరికారు. ఈ ఘటనలో ఆయన రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతిచెందారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. గోపాలకృష్ణకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ హత్య వార్త తెలిసిన వెంటనే కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, పట్టణ సిఐ పి ప్రసాదరావు, ఎస్ఐ ఎస్ఎస్ఎస్ పవన్కుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, హత్య జరిగిన తీరును పరిశీలించారు.
కాగా గోపాలకృష్ణ గతంలో కొవ్వూరులోని ఇసుక రీచ్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఇందుకు సంబంధించిన విభేదాలేమైనా హత్యకు కారణమయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యోదంతంపై దర్యాప్తు వేగవంతం చేశామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు పట్టణ చరిత్రలో ఒక రాజకీయ నేత, అధికార పార్టీకి చెందిన వ్యక్తి హత్యకావడం ఇదే తొలిసారి.
విందు భోజనం చేసి వస్తుడగా...
పట్టణంలో వివాహ విందు భోజనం చేసి తిరిగి మోటారు సైకిల్పై మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఔరంగాబాద్లోని స్వగృహానికి వెళ్తుండగా గోపాలకృష్ణ హత్యకు గురయ్యారు. దుండగులు హత్యకు పాల్పడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ గమనించి, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో కొవ్వూరు వైవు వెళ్తున్న మరో ఆటో డ్రైవర్ గుర్తించి టోల్ గేట్ జంక్షన్లో ఆటో స్టాండుకు సమాచారం అందించినట్లు తెలిసింది.
విషయం అంది కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేసరికే గోపాలకృష్ణ మరణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో దుండగులు ఉపయోగించిన మంకీ క్యాప్ ఒకటి లభించినట్లు తెలుస్తోంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని గుర్తించారు...
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. పాకా గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు.