రేవంత్, ఎర్రబెల్లి మెట్రో వార్: బాబు వద్దకు పంచాయతీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల మధ్య మెట్రో వివాదం మంగళవారం ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందుకు చేరింది. అయితే, వీరి వివాదం నేపథ్యంలో పార్టీకి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబే వారిని పిలిపించినట్లుగా కూడా చెబుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిలు చంద్రబాబును కలిశారు. వారు మెట్రో పైన ఎవరికి వారు తమ వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. మై హోంకు భూముల కేటాయింపుపై ఇరువురు కూడా బాబు ముందు భిన్నవాదనలు వినిపించారని సమాచారం. వారికి చంద్రబాబు సర్ది చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల పైన మెట్రో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. రేవంత్ ఓ సామాజిక వర్గం పేరుతో తిట్టడాన్ని తాను తప్పు పడుతున్నానని, తనకు తెలుగుదేశం పార్టీ వీడే ఆలోచన లేదని ఎర్రబెల్లి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం కేసీఆర్తో భేటీ అయ్యారు.