బంగారు మైసమ్య ఆలయంలో విగ్రహం చోరీ
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులోని సుల్తాన్షాహిలో గల బంగారు మైసమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు గురువారం రాత్రి ఆలయ తాళం పగులగొట్టి గర్భగుడిలోని అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళారు. అమ్మవారి విగ్రహం చోరీ అయిన విషయం తెలుసుకున్న భక్తులు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు గురయ్యారు.
రోజు మాదిరిగానే గురువారం రాత్రి 10 గంటలకు పూజారి ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆలయ కమిటీ సభ్యుడు ఆలయాన్ని తెరిచేందుకు రాగా తాళం పగులగొట్టి ఉంది. గర్భగుడిలోని అమ్మవారి పంచలోహ విగ్రహం కనిపించలేదు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్కుమార్కు తెలియజేశాడు.
కమిటీ సభ్యులు, నిర్వాహకులు, గౌలిపురా కార్పొరేటర్ ఆలే జితేంద్ర, బీజేపీ నాయకులు పాశం సురేందర్, ఎం.కుమార్, ఇ.సుమన్కుమార్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారి విగ్రహం విలువ రూ.85 వేలు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఆలయంలో అమ్మవారి విగ్రహం చోరీ జరిగి స్థానికులు ఆందోళనకు దిగినట్టు సమాచారమందుకున్న మీర్చౌక్ ఏసీపీ గంగాధర్, మొగల్పురా ఇన్స్పెక్టర్ గంగారామ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్టీమ్ బృందాలు ఆలయ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.