ఎన్టీఆర్ను చంపేశారు, ఆడపిల్ల ఉంటే తెలిసేది: బాబుపై దుమ్మెత్తిపోసిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన గురువారం నాడు దుమ్మెత్తిపోశారు. కంటిచూపుతో అవినీతిని అంతం చేస్తానని చెబుతున్న చిఠగ.. ఏపీలోని అవినీతిని ఎందుకు అంతం చేయడం లేదన్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో ఒకలా వ్యవహరిస్తున్నారన్నారు.
రాజధానిని సింగపూర్లా చేస్తానని, జపాన్లా చేస్తానని చంద్రబాబు గొప్పలు పోతున్నారన్నారు. అసెంబ్లీలో, బయటా మహిళల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ఆపలేకపోతున్నారన్నారు.
వనజాక్షి పైన దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ వంటి వారికి బుద్ధి చెప్పాలని మహిళలు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ అంటే ఎన్టీఆర్ భవన్ కాదన్నారు. విలువలు ఉన్నాయని చెప్పే చంద్రబాబు.. మొన్న ఓటుకు నోటు, ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్నారు.
ఎనిమిది మంది ఎమ్మెల్యేల కోసం రాజ్యాంగాన్ని, అసెంబ్లీ రూల్సును వ్యతిరేకించిన ఘనుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే అన్నారు. నియంతలా ఏపీ అసెంబ్లీ నడుస్తోందన్నారు.
తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని చెబుతున్నారని, ఏపీలో మాత్రం అభివృద్ధి చూసి వస్తున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. అక్కడ స్పీకర్ పైన కోర్టుకు వెళ్తున్నారని, కానీ ఇక్కడ స్పీకర్ను మాత్రం ప్రశ్నించేందుకు హక్కు ఎక్కడిదంటున్నారన్నారు.
రాజకీయాల్లో రెండు రకాల ధోరణులు ప్రపంచంలోనే బహుశా ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో అన్నారు. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పే చంద్రబాబు కనీసం రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివారా అని ప్రశ్నించారు. చదవకుంటే రాజ్యాంగం చదవాలన్నారు.
కోర్టు ఉత్తర్వులను అనుసరించి తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకపోవడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రూల్స్ మార్చడమే చంద్రబాబు విలువా అన్నారు. పదవి కోసం ఎన్టీఆర్ను చంపేశాడని, ఇదే ఆయన విశ్వసనీయతా అని ప్రశ్నించారు.
తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లి, వారికి ఓటు వేయమని చెప్పే నైతిక హక్కు, దమ్ము చంద్రబాబుకు ఉందా అన్నారు. టిడిపి నేతల అవినీతిని చంద్రబాబు తన కంటిచూపుతో అంతం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్లో మహిళలను లోబర్చుకుంటుంటే.. చంద్రబాబు తన కంటిచూపుతో ఎందుకు అణచలేకపోతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఆడపిల్ల ఉంటే తెలిసేది
బోండ ఉమ అనుచరుడు, ఆయన భార్య ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి నీచానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాజధానిలో కాల్ మనీ సెక్స్ రాకెట్ను ఎందుకు ఆపలేకపోతున్నారన్నారు. చంద్రబాబుకు ఆడపిల్ల ఉంటే మహిళల సమస్య గురించి తెలిసేదన్నారు.