రోజా ఎవరో తెలియదు: బాబుపై పిల్ వేసిన లాయర్, 'సారీ చెప్పాలట'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పైన హైకోర్టులో సోమవారం నాడు వాదనలు కొనసాగుతున్నాయి. రోజా తరఫున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్, ప్రభుత్వం తరఫున పీపీ రావు వాదనలు వినిపిస్తున్నారు.
హైకోర్టులో జరుగుతున్న వాదనల పైన... రోజా సస్పెన్షన్ అంశంపై పిల్ వేసిన న్యాయవాది మీడియాతో చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రోజాను అసెంబ్లీకి అనుమతించకపోవడంపై సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ను ప్రముఖ లాయర్ గోపాలకృష్ణ కళానిధి దాఖలు చేశారు.
రోజాకు అనుకూలంగా పిల్ దాఖలు చేయడంపై ఆయన మాట్లాడుతూ.. రోజాకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కనీసం తనకు ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలియదని చెప్పారు. తాను న్యాయం కోసమే ఈ పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు.

అదే సమయంలో హైకోర్టులో జరుగుతున్న వాదనల పైన కూడా ఆయన చెప్పారు.
రాజ్యాంగానికి లోబడే రోజా పైన సస్పెన్షన్ వేటు పడిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర సభ్యులను దూషించినందువల్లే వేటు వేసినట్లు చెప్పారన్నారు. ఆమె క్షమాపణ చెబితే ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని చెప్పారన్నారు.
రోజా పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఏం చర్యలు తీసుకున్నారని జడ్జి అడగగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానం చెప్పలేదని తెలిపారు.
రోజా తమకు క్షమాపణ చెబితే ఇంత దాకా వచ్చేది కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారని, ఈ రోజు క్షమాపణ చెప్పినా అనుమతిస్తామని చెప్పారని తెలిపారు.
ప్రభుత్వ లాయర్ సూచన పైన మీ స్టాండ్ ఏమిటని జడ్జి ప్రశ్నించారని తెలిపారు.
దానికి రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ... ఇంత దాకా వచ్చాక క్షమాపణ చెప్పేది లేదని తెలిపారని అన్నారు. వాదనలు వినిపిద్దామని చెప్పారని వివరించారు.












Click it and Unblock the Notifications