ఆర్డర్ కాపీతో రానున్న రోజా: అడ్డుకునేందుకు మార్షల్స్ రెడీ, 3 మార్గాలేమిటి?
హైదరాబాద్: వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రోజా కోర్టు ఆర్డర్తో అసెంబ్లీకి రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వైసిపి ఎమ్మెల్యేలు గేటు వద్ద సిద్ధంగా ఉన్నారు. మరోవైపు, రోజాను అడ్డుకునేందుకు మార్షల్స్ సిద్ధంగా ఉన్నారు.
స్పీకర్దే తుది నిర్ణయం అని అధికార పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై ఉత్తర్వులు చూశాక ఏం చేయాలనే ఆలోచన చేద్దామని ప్రభుత్వం, స్పీకర్ యోచిస్తున్నారు. ఉత్తర్వులను పరిశీలించాకే రోజాను వచ్చేలా చేయాలా, లేక అడ్డుకోవాలా నిర్ణయం తీసుకోనున్నారు. మార్షల్స్ మాత్రం సిద్ధంగా ఉన్నారు.
హైకోర్టు బెంచ్కు ప్రభుత్వం
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఏఫీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి న్యాయ సలహాలు తీసుకుంటోంది. యనమల రామకృష్ణుడు స్పీకర్ కోడెల శివప్రసాద రావు, సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. నిన్న కూడా రూల్స్ మార్చివేశారని, దీనిపై తాము కోర్టుకు వెళ్తున్నామన్నారు.
రోజాపై విధించిన సస్పెన్షన్ వేటుపై వెనకడుగు వేసేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటోందని తెలుస్తోంది. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ గురువారం ఉదయం హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగిపోయారు.
సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావులతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రోజాపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి వీలు లేని విధంగా చర్యలు చేపట్టాలని ఈ చర్చల్లో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నారు.
ఈ క్రమంలో హైకోర్టుల జారీ చేసిన ఉత్తర్వులను ఎలా ఎదుర్కోవాలా? అన్న అంశంపై మూడు ప్రతిపాదనలు వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వీటిలో సాయంత్రంలోగా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలనేది తొలి ప్రత్యామ్నాయం.
ఇక హైకోర్టు తీర్పును శాసనసభ గౌరవించాల్సిన అవసరం లేదన్న వాదన దిశగా అడుగులేయడనేది రెండోది. మూడో ప్రతిపాదనగా కీలక అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రోజా సస్పెన్షన్ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ విచారణలో ఉన్న నేపథ్యంలో... రోజాపై మరోమారు సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మూడింటిలో దేనినో ఒకదానికి అనుసరించనుంది.