రౌడీ షీటర్ కృష్ణారెడ్డ్డి దారుణ హత్య: ఇరానీ దొంగల ముఠా లీడర్ అరెస్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం జ్యోతినగర్లో రౌడీషీటర్ కృష్ణారెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా టీకొట్టు నడుపుతూ జీవిస్తున్న హరిసింగ్ వద్దకు కృష్ణారెడ్డి వచ్చి మద్యంమత్తులో గొడవ పడ్డాడు.
గొడవ పెరగడంతో ఆగ్రహం పట్టలేని హరిసింగ్ కృష్ణారెడ్డి తలపై బండరాయితో గట్టిగా మోదాడు. దీంతో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. హరిసింగ్ పరారయ్యాడు. డీఎస్పీ మక్బుల్, సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కృష్ణారెడ్డి పలు కేసుల్లో నిందితుడని, అతడిపై రౌడీషీట్కూడా ఉందని డీఎస్పీ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇరానీ ముఠా నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పోలీసులు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపర్చారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో మొబైల్ఫోన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 87 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
కడప జిల్లాలోని రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు చంద్రశేఖర్, గిరిబాబు, ఈశ్వరయ్యలను అరెస్టు చేశారు. స్మగ్లర్లు టిప్పర్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.