టీడీపీలోకి సబ్బం హరి!: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?, ఎక్కడ్నుంచి పోటీ?
Recommended Video
అమరావతి/విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖపట్నం మాజీ మేయర్ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును సబ్బం హరి పలుమార్లు ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం.
ఏపీ అభివృద్ధికి చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సబ్బంహరి అన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేనటువంటి సబ్బం హరి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పోటీ ఎక్కడ్నుంచి..?
ఈ నేపథ్యంలో, ఆయనకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కానీ, విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని సబ్బం హరి కోరినట్టు తెలుస్తోంది.
సంబంధం లేదని వైసీపీ
కాగా, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి సబ్బం హరి వీరాభిమాని. 2009లో అనకాపల్లి లోకసభ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్ను ఓడించారు. వైయస్ మరణానంతరం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే, 2014 ఎన్నికల్లో జగన్ గెలిస్తే... యూపీఏకు మద్దతు ఇస్తారని అప్పట్లో ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, సబ్బం హరితో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది.
అప్పట్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చారు
రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సబ్బం హరి మద్దతుగా నిలిచారు. కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో కూడా చేరారు. విశాఖ ఎంపీగా నామినేషన్ వేసినప్పటికీ... చివరి క్షణంలో మనసు మార్చుకుని టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు. కానీ, ఇప్పుడు టీడీపీ, బీజేపీలు విడిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయింది.
చంద్రబాబు గ్రీన్సిగ్నల్తో..
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సబ్బంహరి జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తే కీలకపాత్ర పోషించాలని, మళ్లీ పట్టు సాధించాలని తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ రెండూ ఆయన్ను తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. సమయం చూసి నిర్ణయం తీసుకుంటానంటూ తటస్థంగా ఉన్న ఆయన.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్టన్లు తెలిసింది. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తుండటంతో ఆయన టీడీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.