వైసీపీలో సజ్జల తనయుడికి కీలక బాధ్యతలు - ఎన్నికల వేళ..!!
వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్త ఏడాదిలో పార్టీ ప్రక్షాళన దిశగా వేగంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసమ్మతి గళం వినిపిస్తున్న సీనియర్ నేత ఆనం నియోజకవర్గం వెంకటగిరికి కొత్త ఇంఛార్జ్ గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. దాదాపు మూడేళ్లుగా ఆధిపత్య పోరుతో సతమతం అవుతున్న చీరాలను కరణం కు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పర్చూరు ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయించారు. పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో భాగంగా పార్టీకి ఎన్నికల వేళ ప్రచారంలోకి కీలక భూమిక పోషించే సోషల్ మీడియా..మీడియా కో ఆర్డినేటర్ గా సజ్జల కుమారుడు భార్గవ రెడ్డిని నియమించారు.
భార్గవ రెడ్డి ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో భార్గవ్ పాల్గొన్నారు ఆ సమయంలో మీడియా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యుల నియామక సమయంలో భార్గవ్ హోదాను అధికారికంగా ఖరారు చేసారు. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా బలంగా ప్రభావితం చేసింది. అప్పుడు జగన్ పాదయాత్ర.. మేనిఫెస్టోతో పాటుగా చంద్రబాబు పాలనలోని లోపాలను..హామీల విస్మరణ గురించి సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయింది.

ఇప్పుడు, టీడీపీకి రాజకీయ వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ అండ్ టీం సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో భార్గవ్ రెడ్డికి ఎన్నికల వేళ పార్టీకి మద్దతుగా మీడియా - సోషల్ మీడియా కో ఆర్డినేషన్ కీలకం కానుంది. ప్రభుత్వం - ప్రజల మధ్య వారధిగా వ్యవహరించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ బాధ్యతలను చూసేవారు. ఆయనకు ఇతర బాధ్యతలతో భార్గవ్ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఏపీలో రాజకీయంతో పాటుగా సోషల్ మీడియాలోనూ వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భార్గవ్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా కొత్త వ్యూహాలతో మీడియా -సోషల్ మీడియాను ఎలా నడిపిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications