SIR షాక్: 6 కోట్ల ఓట్లు డిలీట్: మీ ఓటు హక్కు సురక్షితమేనా?
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరిగిన ప్రక్షాళన ప్రక్రియ అసాధారణ పరిణామాలకు దారితీస్తోంది. ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'ప్రత్యేక ముమ్మర సవరణ’ (SIR) ప్రక్రియ ఒక సంవత్సరం పూర్తి చేసుకునే సరికి, ఏకంగా ఆరు కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయమయ్యాయి.
గత ఏడాది జూన్ 24న బీహార్లో పైలట్ ప్రాజెక్ట్గా మొదలైన ఈ యజ్ఞం, ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని కమిషన్ చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటు బ్యాంకును ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రెండో దశలో కుప్పకూలిన ఓటర్ల సంఖ్య..
ప్రక్షాళనలో భాగంగా జరిగిన రెండో దశలో సంఖ్యాపరంగా విస్తుపోయే మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గతంలో 50.99 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ప్రక్షాళన అనంతరం 45.81 కోట్లకు పడిపోయింది. అంటే, కేవలం ఈ దశలోనే దాదాపు 10.2 శాతం ఓటర్ల సంఖ్య తగ్గడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇందులో మరణించిన వారి రికార్డులే ప్రధానంగా ఉన్నాయి. కేవలం మరణించిన ఓటర్లనే తీసుకుంటే 66.88 లక్షల మంది పేర్లను జాబితాల నుంచి తొలగించారు, అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 25.47 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 24.16 లక్షల మంది ఉండటం గమనార్హం.
మూడో దశలో తెలుగు రాష్ట్రాల కీలకం..
ప్రస్తుతం మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణతో పాటు మరో 14 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల పరిధిలో జరుగుతున్న ఈ ప్రక్రియతో, రానున్న కొద్ది నెలల్లో ఓటర్ల జాబితాలో మరిన్ని భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వివాదంపై స్పందించిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ భారత ప్రజల ప్రాతినిధ్య చట్టానికి లోబడే సాగుతోందని తేల్చిచెప్పడంతో, విమర్శలకు తాత్కాలికంగా తెరపడింది.
పాఠ్యపుస్తకాల్లోనూ ఓటర్ల ప్రక్షాళన..
ఈ ప్రక్రియ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందంటే, దీనిని భావితరాలకు తెలియజేయడానికి ఎన్సీఈఆర్టీ (NCERT) ఏకంగా సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఒక భాగంగా చేర్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ఎన్నికల నాణ్యత మెరుగుపడాలంటే ఈ శుద్ధి ప్రక్రియ అత్యంత ఆవశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒక సామాన్య పౌరుడు తమ ఓటు హక్కును కోల్పోకుండా, ఈ భారీ ప్రక్షాళనలో అధికారులు ఎంతవరకు పారదర్శకంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది.














Click it and Unblock the Notifications