జనసేనలోకి జగన్ సన్నిహిత సీమ నేత, ముహూర్తం ఫిక్స్..!?
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కూటమి - వైసీపీ మధ్య రాజకీయ పోరు ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో కొందరు నేతలు పార్టీల మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. రాయలసీమ నుంచి జగన్ సన్నిహిత నేత ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. ముహూర్తం ఖరారైంది.
మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు సమయం నుంచి అండగా నిలిచిన నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనంతపురం లో వైఎస్ కుటుంబంతో తొలి నుంచి బీఎన్ఆర్ ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009 లో అనంతపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గుర్నాథ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున భారీ మెజార్టీతో విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత, కొన్ని విభేదాల కారణంగా 2017లో పార్టీకి దూరంగా ఉన్నా, 2018 డిసెంబర్లో మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిక సమయం లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. జగన్ కాంగ్రెస్ ను వీడి సొంతం గా పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో జగన్ కు మద్దతుగా నిలిచిన వారిలో గుర్నాధరెడ్డి ఒకరు కావటంతో.. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు అంగీకరించారు.
కాగా, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి గుర్నాధ రెడ్డికి ప్రాధాన్యత లేదు. వైసీపీ అధికారంలో ఉండటంతో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ తిరిగి వెంకట్రామిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి దగ్గుపాటి వేంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. ఇక.. ఈ రెండేళ్ల కాలంలో అనంతపురం లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది నెలల క్రితమే గుర్నాధ రెడ్డి జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది.
కాగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరాలని గుర్నాథ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన పవన్ ను కలుస్తున్నారని సమాచారం. భారీ కాన్వాయ్ తో తన అనుచరులతో కలిసి పవన్ సమక్షం లో జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని ఆయన మద్దతు దారుల సమాచారం. అయితే, గుర్నాథ రెడ్డి ఇప్పటికే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications