కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!
నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెలరోజుల పాటు నిరసనలు (CJP Protests) చేపట్టింది. ఆ తర్వాత గత నెల 20న పార్లమెంట్ మార్చ్ కు కూడా పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బలప్రయోగం కూడా చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ బిగ్ ట్విస్ట్ ఎదురైంది.
జంతర్ మంతర్ సహా ఢిల్లీలో జరిగిన నిరసనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు, పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు తుది అంచనాకు రావడానికి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లూ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్దులపై కేసులు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ప్రమాదంలో పడింది.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనల వల్ల తలెత్తిన సమస్యలు, ఆరోపణలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై సంబంధిత వర్గాలు, పిటిషనర్ల సూచనలను చేర్చిన తర్వాత రేపు తుది ఉత్తర్వులను విడుదల చేస్తామని పేర్కొంది. తమవైపు నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్ ఒకరిని, అలాగే మాజీ న్యాయమూర్తి ఒకరిని ఈ కమిటీలో చేర్చింది. విద్యార్ధుల నిరసన ప్రదర్శన, పోలీసుల చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఈ కమిటీకి సమర్పిస్తామని, అలాగే ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా మహిళా నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారని వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే విద్యార్థులపై మూసేయాల్సిన కేసుల వివరాలను కూడా ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.














Click it and Unblock the Notifications