రైతులకు అలెర్ట్... సన్నబియ్యం బోనస్ కావాలంటే రేపటిలోగా ఆ పని చెయ్యాల్సిందే!
తెలంగాణ రైతులకు రాష్ట్రప్రభుత్వం ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. సన్నబియ్యం సాగు చేసిన రైతులకు బోనస్ ఇవ్వటం కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది తెలంగాణా ప్రభుత్వం 2026-27 వానాకాలం సీజన్లో సన్నబియ్యం సాగు చేస్తున్న రైతులు తమ విత్తనాల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని పేర్కొంది. ఆగస్టు 19వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే క్వింటాకు రూ.500 చొప్పున అందించే బోనస్ దక్కదని వ్యవసాయశాఖ స్పష్టంచేసింది.
ఈ వరి వంగడాలకు మాత్రమే బోనస్
ప్రభుత్వం గుర్తించిన ఏడురకాల వరి వంగడాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. అవి బీపీటీ-5204 సాంబమసూరి, ఆర్ఎన్ఆర్-15048 తెలంగాణ సోనా, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 కూనారం సన్నాలు, డబ్ల్యూజీఎల్-44 సిద్ధి, కేఎన్ఎం-7715. ఈ రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా కొనుగోలు చేస్తోంది. అందుకే రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రైతులు ఆగస్టు 19లోగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి
దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియ చాలా సులభం. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దకు వెళ్లి, తమ వివరాలు మరియు వరి రకం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. డీలర్లు రైతు పేరు, భూమి వివరాలు, విత్తన రకం వంటి సమాచారాన్ని సిస్టమ్లో ఎంటర్ చేస్తారు. విత్తనాలు కొన్నప్పుడు ఇచ్చిన బిల్లు లేదా రసీదును డీలర్కు చూపించాలి. ఈ ప్రక్రియను ఆగస్టు 19లోగా పూర్తి చేయాలని అధికారులు హెచ్చరించారు.
రైతులకు ఒక్కరోజే సమయం.. నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ఇంకా నమోదు చేయించుకోని రైతులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదు చేయకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవచ్చు. దీని వల్ల రైతులు దళారులకు లేదా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడే నమోదు ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
గడువు ముగిసేలోపు ఆన్ లైన్ చేసుకున్నవారికే బోనస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం సాగుదారులకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తోంది. ఈ పథకం రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు నాణ్యమైన సన్న వడ్ల సాగును ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.వ్యవసాయ శాఖ అధికారులు రైతులను వెంటనే స్పందించాలని కోరారు. ఏదైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ కార్యాలయం లేదా సంబంధిత డీలర్ను సంప్రదించవచ్చు. గడువు ముగిసేలోపు నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే బోనస్ దక్కుతుందని మరోసారి స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications