నంద్యాల ఫలితంపై సబ్బం సంచలన వ్యాఖ్య, రోజా పూజలు చేసినా...
నంద్యాల ఫలితాలే కాకినాడలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ: నంద్యాల ఫలితాలే కాకినాడలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ గెలుపు సందర్బంగా విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి గంటా మాట్లాడుతూ నంద్యాల ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని చెప్పారు. జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను చూసి ప్రజలు భయపడ్డారని అన్నారు. జగన్ 14 రోజులు నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేసి... ప్రజలను మభ్య పెట్టాలని చూశారని దుయ్యబట్టారు.
అయితే జగన్ మాటలను అక్కడి ప్రజలు విశ్వసించలేదని, 2019లో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. జగన్ మానసిక పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకున్నారని, అందుకే టీడీపీకి నంద్యాలలో భారీ మెజార్టీని ఇచ్చారని గంటా చెప్పారు.
చంద్రబాబు అభివృద్ధి ఫలమిది: మాజీ ఎంపీ సబ్బం హరి
నంద్యాల గెలుపు చంద్రబాబు అభివృద్ధి ఫలమని మాజీ ఎంపీ సబ్బం హరి చెప్పుకొచ్చారు. మోడీ, పవన్ వల్ల అధికారంలోకి రాలేదని చంద్రబాబు నిరూపించారని ఆయన కొనియాడారు. ఎవరి సహకారం లేకుండా టీడీపీ గెలవగలదని నిరూపించారన్నారు. నోరు పారేసుకున్న జగన్, రోజా లాంటి వాళ్లకు నంద్యాల తీర్పు చెంపపెట్టని ఆయన చెప్పారు. అసలు ఏపీ బడ్జెట్ రూ.లక్ష కోట్లు అయితే, రూ. 3 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని సబ్బం హరి ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
రోజా ఎన్ని పూజలు చేసినా...
నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. వార్ వన్సైడ్ అయిపోయింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. నంద్యాల తమదేనని, టీడీపీకి ఓటర్లు బుద్ధి చెబుతారని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా నంద్యాలలో ఓట్ల లెక్కింపునకు ముందు తన ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. నంద్యాలలో వైసీపీ గెలవాలంటూ దేవుణ్ని వేడుకున్నారు. కానీ దేవుడు ఆమె మొర ఆలకించకపోవడంతో నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజారిటీ వచ్చింది.
2019లోనూ రోజానే పంపండి: సోమిరెడ్డి వ్యగ్యం
నంద్యాలలో టీడీపీ భారీ మెజారిటీతో విజయం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారానికి కూడా రోజానే పంపించాలని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రోజా ప్రచారం చేయడం వల్లే నంద్యాలలో వైసీపీ ఓడిపోయిందని మరికొంత మంది నేతలు విమర్శిస్తున్నారు. అయితే ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చింది..' అన్న చందంగా.. నంద్యాలలో వైసీపీ ఓటమికి రోజాను బాధ్యురాలిని చేయడం సబబు కాదని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు పిలుపును ప్రజలు అర్థం చేసుకున్నారు: గద్దె రామ్మోహన్
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ డోలాయమాన స్థితిలో లేదని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ అన్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితిపై ఆందోళన చెందకుండా సమస్యలను అధిగమిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే భావనతో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళుతూ ప్రజలకు నమ్మకం కలగజేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఓ తెల్ల పుస్తకంలా ఉన్నది ఉన్నట్లు సీఎం ప్రజల ముందు పెట్టారని, రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నదీ చెబుతూ, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారని అన్నారు. ప్రజలు వాస్తవాల్ని అవగాహన చేసుకున్నారని గద్దె అన్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారనేది నంద్యాల తీర్పు ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు. ప్రజా విధానాలు తెలిసిన నాయకుడు చంద్రబాబని గద్దె కొనియాడారు.
జగన్ కోరారు.. ఓటర్లు నెరవేర్చారు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ధర్మానికి, న్యాయానికి ఓటు వేయాలని ప్రజలను కోరారని, ప్రజలు ఆయన మాటను గౌరవించి ధర్మం, న్యాయానికే ఓటేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలు ధర్మం వైపే ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడితే ఓట్లు పడిపోతాయని జగన్ భావించారని, పీకే సలహా పట్టుకుని రెచ్చిపోయారని విమర్శించారు. అది బూమరాంగై చివరికి జగన్కే తగిలిందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వైసీపీకి నంద్యాల ప్రజలు దిమ్మదిరిగే షాకిచ్చారన్నారు. ఈ ఓటమి శిల్పాది కాదని, జగన్దని మంత్రి పేర్కొన్నారు.