సీమాంధ్ర రాజధాని: విజిఎంటి దిశగా, విశాఖపై పరిశీలన
కొత్త రాజధాని ఏర్పాటు నిర్ణయం త్వరలో జరిగిపోతుందని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి(విజిఎంటి) మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే దిశలో పలువురు సూచనలు చేస్తున్నారు. సెర్చ్ కమిటీ ఏర్పాటుకు ముందుగానే కొంతమంది అధికారులు సెర్చ్ కమిటీకి ఏం చెప్పాలన్న కోణంలో సమాలోచనలు చేస్తున్నారు.
అవశేష ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎక్కడైతే బాగుంటుందన్న కోణంలో అధ్యయనం చేస్తున్నారు. మెజార్టీ అధికారుల దృష్టి విజిఎంటి అభివృద్ధి మండలిపైనే కేంద్రీకృతమవుతోంది. ఈ ప్రాంతం అయితే అన్నివిధాలా కొత్త రాజధానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా కొత్త రాజధాని ఏర్పాటుకు మూడు ప్రధానాంశాలు అందుబాటులో ఉండాలి. మౌలిక సౌకర్యాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా వ్యవస్థ అనుసంధానం, ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అందుబాటులో ఉండటం కొత్త రాజధానికి అర్హతలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఈ మూడు అంశాలు ఎక్కడ ఉన్నాయన్న కోణంలో అధికారులు దృష్టి పెట్టారు. ముందుగా సీమాంధ్రలో అత్యంత పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. విశాఖపట్నంలో వౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల నుంచి రవాణా వ్యవస్థ మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఉత్తరాఖండ్ తరహాలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే విశాఖపట్నాన్ని కూడా రాజధానిగా పరిశీలించే ఆస్కారం ఉంటుందంటన్నారు. ఉత్తరాఖండ్లో కొన్నిప్రాంతాల నుంచి సరైన రైలు, బస్సు మార్గ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో అక్కడ విమాన సర్వీసులను వినియోగిస్తున్నారు. రవాణా వ్యవస్థ అందుబాటులోలేని ప్రాంతాల్లో చిన్న చిన్న విమానాలను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండే ప్రాంతాలకు తిప్పుతున్నారు.
ఇక విశాఖపట్నాన్ని కాదనుకుంటే అన్ని కోణాల్లో అర్హతలు కలిగిన ప్రాంతంగా విజిఎంటిని చెబుతున్నారు. గుంటూరు- కృష్ణా జిల్లాల్లోని ముఖ్యమైన పట్టణాలతో విజిఎంటి జోన్ను గుర్తించి ప్రత్యేక అభివృద్ధి మండలిని గతంలోనే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో, అందరికీ అందుబాటులో ఉంటుందని అధికారులు నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో మచిలీపట్నం ఓడరేవు, గన్నవరం విమానాశ్రయంతోపాటు, అన్ని ప్రాంతాలను కలిపే రైలు, బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఇలా ఉండగా, కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసినా మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కాకుండా సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలకూ ముఖ్యమైన కార్యాలయాలు కేటాయించడం కూడా మంచిదన్న భావాన్ని సూచిస్తున్నారు. విజిఎంటిలో రాజధానిని ఏర్పాటు చేస్తే రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో హైకోర్టు, ఎపిపిఎస్సిలను ఏర్పాటు చేస్తే మంచిదంటున్నారు. ఇందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న విధానాలనూ వారు ఉదహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications