ఎన్నికల వేళ.. జగన్కు కీలక ప్రతిపాదన
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందడి పతాక స్థాయిలో చేరుకుంటోంది. టికెట్ దక్కని అసంతృప్త నేతలు పార్టీల ఫిరాయింపులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి చెందిన సీనియర్ నేతలు అటు ఇటు అవుతున్నారు. పార్టీ కండువాలను కప్పుకొంటోన్నారు.
ఈ పరిస్థితుల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ఆయన జగన్కు కొన్ని కీలక ప్రతిపాదనలను అందజేశారు. దానికి సంబంధించిన వివరాలను సునీల్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న దళితవాడలను పంచాయతీలుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దళితులను దళితులు మాత్రమే పరిపాలించుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో దళితుల జనాభా అధికంగా ఉన్న 1,500 పంచాయతీల్లో అదే సామాజిక వర్గ మహిళలను సర్పంచ్లుగా నియమించాలని, దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని అన్నారు.
ప్రతీ దళిత వాడకీ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు చొప్పున అయిదేళ్ల వ్యవధిలో 10 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని పీవీ సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రతి దళిత వాడకు సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, చెత్త కనపించని పరిశుభ్రమైన పరిసరాలు, 40 విద్యార్థులకు ఒక టీచర్తో స్మార్ట్ స్కూళ్లు, ప్రభుత్వ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాలు, కోచింగ్ సెంటర్, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీటిని సరఫరా చేయడానికి దళితవాడలకు పంచాయతీ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దళితుల సొమ్ముతో దళితులే పాలకులుగా గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి డేటా, డాక్యుమెంటేషన్తో సహా వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించి నెలలోపు తగిన ఉత్తర్వులు జారీ చేయమని అధికారులను ఆదేశించారని పీవీ సునీల్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications