అమిత్ షా కోరుకుందే టీడీపీలో జరుగుతోంది - జూనియర్ భేటీతో పార్టీలో చీలిక..!!
విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ మారిన అంశం భారతీయ జనతా పార్టీ బిగ్ షాట్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం. అనూహ్యంగా సంభవించిన ఈ పరిణామం అన్ని రాజకీయ పార్టీలను కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేశాయి. అమిత్ షా వంటి బలమైన నాయకుడు తన తెలంగాణ పర్యటన సందర్భంగా అదే పనిగా జూనియర్ ఎన్టీఆర్ను పిలిపించుకోవడం చర్చనీయాంశమైంది.
జగన్ను టార్గెట్ చేయడానికి చిరంజీవిని వాడుకుంటోన్న పవన్ కల్యాణ్..?
టీడీపీకి కొత్త తలనొప్పులు..
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఛరిష్మాను రాజకీయంగా బదలాయించుకోవాలనే ఉద్దేశంతో అమిత్ షా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని సైతం కాదని, జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కావడాన్ని అటు తెలుగుదేశం పార్టీ కూడా ఏ మాత్రం ఊహించనిదే. జూనియర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ ఆయన అభిమానులు చేస్తోన్న డిమాండ్తో ఇప్పటికే టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి.
స్పందించొద్దంటూ..
ఇప్పుడు తాజాగా ఏకంగా ఆయనతోనే అమిత్ షా వంటి బిగ్ షాట్ భేటీ కావడం టీడీపీ ఇబ్బందులను మరింత పెంచినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమిత్షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ భేటీ పట్ల ఎవరూ స్పందించవద్దంటూ పార్టీ టాప్ క్యాడర్ ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. స్పందించాల్సిన పరిస్థితే వస్తే- దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా మాట్లాడాలంటూ సూచించినట్లు సమాచారం.
బుద్ధా వెంకన్న..
ఇప్పుడు ఈ భేటీపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించిన విధానం కూడా అదే స్థాయిలో ఉంటోంది. అమిత్ షాను ఎన్టీఆర్ కలవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. దీన్ని సినిమాపరంగా మాత్రమే చూడాలని, తాము అదే చేస్తోన్నామని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడానికే అమిత్ షా ఆయనను పిలిపించుకున్నట్లు తాము భావిస్తోన్నామని పేర్కొన్నారు.
సినిమాగా మాత్రమే..
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సమయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ కూడా ఆయనను అభినందిస్తూ ట్వీట్లు చేశారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏ రకంగా చూసినా వారిద్దరి భేటీని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ నాయకులందరూ ఈ సినిమాను చూశారని చెప్పారు. అందులో ఎలాంటి రాజకీయం లేదని, సినిమాగా మాత్రమే చూడాలని అన్నారు.
జూనియర్పై నిప్పులు..
టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు, ఆ పార్టీ అభిమానులుగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఎన్టీఆర్పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్నారు. ఆయనను దూరం పెట్టి టీడీపీ మంచిపని చేసిందని కామెంట్స్ చేస్తోన్నారు. తనకు ఉన్న పేరును పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా బీజేపీ ఎదుగుదలకు ఎన్టీఆర్ మళ్లిస్తోన్నాడని మండిపడుతున్నారు. దీన్ని ఏ మాత్రం సహించబోమని ధ్వజమెత్తుతున్నారు.